
ప్రజల ఆరోగ్య పరిరక్షణే ముఖ్యం
సిద్దిపేటజోన్: రాబోయేది వర్షాకాలమని, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు. శుక్రవారం మున్సిపల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన పారిశుద్ధ్య నిర్వహణ పనుల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా యూజీడీ నిర్వహణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పట్టణంలో యూజీడీ లీకేజ్ సమస్యలు రావొద్దన్నారు. పట్టణ ప్రజలు దోమల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఫాగింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పట్టణంలో ఆరుబయట చెత్త వేయకుండా చూడాలని, అందుకు సంబంధించిన నిఘా పటిష్టంగా అమలు పరచాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగాలని, శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలన్నారు. పట్టణంలో చెట్లను ఇష్టానుసారంగా నరికివేయకుండా, కేవలం ట్రిమ్మింగ్ చేసేలా చేయాలన్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో పగటి వేళ విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందికి ఆదేశాలివ్వాలని మున్సిపల్ చైర్పర్సన్ అన్నారు. అంతకుముందు పలు అంశాలపై కౌన్సిల్ సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
రాబోయే మున్సిపల్ సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి సురేఖ, జిల్లా మంత్రి ప్రభాకర్ ను ఆహ్వానించాలని సూచించారు. కప్పల కుంట చెరువు మరమ్మతులకు నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎజెండాలోని 13 అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
యూజీడీపై పర్యవేక్షణ అవసరం
అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి సేవలందించాలి
మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల

ప్రజల ఆరోగ్య పరిరక్షణే ముఖ్యం