
లక్ష్యం.. రూ 45.31కోట్లు
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ మార్కెట్ల ఆదాయం రూ.45.31కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు, లైసెన్స్లు, చెక్ పోస్టులు, మార్కెట్ కాంప్లెక్స్ల ద్వారా ఆదాయం లభిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికలు రూపొందించారు. 2023–24 సంవత్సరానికి రూ 27.18 కోట్లు, 2024–25కు రూ. 33.94 కోట్లు ఆదాయం రాగా 2025–26కు రూ.45.31 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లాలో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లతో మరింత సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండటంతో మార్కెట్ ఆదాయం సైతం పెంచారు. గతేడాదితో పోల్చితే దాదాపు రూ.11కోట్ల ఆదాయం పెంచాలని నిర్ణయించారు. సిద్దిపేట మార్కెట్ కమిటీకి 2023–24 కంటే 2024–25లో ఆదాయం తగ్గినప్పటికీ ఈసారి అధిగమించాలని నిర్ణయించారు. చేర్యాల మార్కెట్కు 2023–24 కంటే 2024–25లో ఆదాయం అధికంగా రావడంతో 2025–26కు లక్ష్యం పెంచారు. ప్రస్తుతం విధించిన లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమేనని మార్కెట్ శాఖ అధికారులు భావిస్తున్నారు.
సిద్దిపేట మార్కెట్ కార్యాలయం
మార్కెట్ల ఆదాయం
మార్కెట్ 2025–26(లక్ష్యం) 2024–25 2023–24(రూ .లక్షల్లో)
సిద్దిపేట రూ. 519.0 రూ.361.04 రూ 366.24
చిన్నకోడూరు రూ.251.90 రూ.187.12 రూ 162.77
నంగనూరు రూ.149.90 రూ.127.51 రూ 80.41
తొగుట రూ.125.50 రూ.70.06 రూ 35.08
దౌల్తాబాద్ రూ.212.80 రూ.150.05 రూ 86.89
కొండపాక రూ.245.60 రూ.138.29 రూ 73.00
మిరుదొడ్డి రూ.207.40 రూ.141.92 రూ 58.27
దుబ్బాక రూ.290.90 రూ.195.70 రూ 195.43
బెజ్జంకి రూ.308.60 రూ.269.61 రూ 267.54
హుస్నాబాద్ రూ.530.60 రూ.456.57 రూ 403.47
కోహెడ రూ.235.60 రూ.121.37 రూ 112.12
గజ్వేల్ రూ.499.70 రూ.481.23 రూ 346.73
చేర్యాల రూ.703.70 రూ.481.04 రూ 357.84
ఒంటిమామిడి రూ.250.60 రూ.212.76 రూ 173.06
●
ఆదాయాలకు
అనుగుణంగా లక్ష్యాలు
జిల్లాలో ఉన్న మార్కెట్ల ఆదాయాలకు అనుగుణంగా 2025–26 సంవత్సరానికి లక్ష్యాలు విధించాం. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి సైతం వంద శాతం లక్ష్యం చేరుకునేందుకు మార్కెట్ కార్యదర్శులు కృషి చేయాలి.
– నాగరాజు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, సిద్దిపేట
ఆదాయం సమకూరుతుందిలా..
మార్కెట్ యార్డులకు రైతులు తీసుకొని వచ్చిన పంట ఉత్పత్తులను వ్యాపారులు కొనుగోలు చేస్తారు. వ్యాపారుల చేపట్టే లావాదేవీల ఆధారంగా మార్కెట్ యార్డుకు ఫీజు చెల్లిస్తారు. పంట ఉత్పత్తుల కొనుగోలు చేసే రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, పత్తి మిల్లులు, ఇతర ఏజెన్సీలు సైతం ఫీజు చెల్లిస్తారు. పంట ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించేటప్పుడు చెక్ పోస్టుల వద్ద సంబంధిత యార్డులకు ఫీజు చెల్లించాలి. ప్రభుత్వం తరపున సీసీఐ, మార్కెఫెడ్, నాఫెడ్ ఇతర సంస్థలు యార్డుల్లో పంట ఉత్పత్తులకు మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తుంటాయి. ఇలా వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో జరుపుతున్న పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలపై ఫీజును వసూలు చేస్తూ ఆదాయం సమకూర్చుకుంటాయి.
మార్కెట్ల ఆదాయానికి
కార్యాచరణ ప్రణాళిక
జిల్లాలో 14 వ్యవసాయ మార్కెట్లు
గతేడాది కంటే రూ.11కోట్ల ఆదాయం
పెరిగే అవకాశం

లక్ష్యం.. రూ 45.31కోట్లు