
పంట నష్ట పరిహారం నిధులు విడుదల
ప్రశాంత్నగర్(సిద్దిపేట): మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం నిధులు విడుదల అయినట్లు జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. జిల్లాలో 4,913 మంది రైతులకు గాను రూ.6.141 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. అయితే మే నెలలో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల పంటల వివరాలు ప్రభుత్వానికి నివేదికలు అందించామని, వీటి నిధులు వెంటనే విడుదల అయ్యే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
పారదర్శంగా ఎంపిక జరగాలి
సిద్దిపేటరూరల్: ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. నిరుద్యోగులకు లబ్ధి చేకూరే విధంగా ఉండాలన్నారు. పథకం అమలు తీరుపై పలు సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ జయదేవ్ఆర్యా, డీఆర్ఓ నాగరాజమ్మ, మైనార్టి, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భూ సమస్యలను
పరిష్కారించాలి
అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్
హుస్నాబాద్రూరల్: ప్రభుత్వం చేపట్టిన భూ భారతి చట్టం పరిధిలో రైతుల సమస్యలను పరిష్కారించాలని అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో అక్కన్నపేట మండల భూ రికార్డుల ప్రక్షాళనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఇచ్చిన అర్జీలను పరిశీలించి సమస్యలకు పరిష్కారం చూపించాలని చెప్పారు. వేగంగా దరఖాస్తులను పరిష్కరిస్తే ప్రభుత్వం జూన్ 2 తర్వాత పైల్ ప్రాజెక్టు మండలాల మాదిరిగానే మిగితా మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఆర్డీవో రామ్మూర్తి, అక్కన్నపేట తహసీల్దార్ అనంత్రెడ్డి, రుక్మిణి రెడ్డి తదితరులు ఉన్నారు.
రుతుచక్ర పరిశుభ్రతపై
అవగాహన: దేవకీదేవి
సిద్దిపేటరూరల్: రుతుచక్ర పరిశుభ్రతపై జిల్లా వ్యాప్తంగా 58 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక మహిళా గ్రామసభలు నిర్వహించినట్లు జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి బుధవారం తెలిపారు. దాదాపుగా 15వేల 758 మంది మహిళలకు రుతుచక్ర పరిశుభ్రతపై తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలు వంటివాటిపై సంపూర్ణ అవగాహన కల్పించామన్నారు. అనంతరం 250 గిరిజన మహిళలకు మెన్స్ట్రువల్ కప్లను పంపిణీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే
నాణ్యమైన విద్య
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ వలీ
దుబ్బాక: ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వెచ్చించి విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్ధికంగా కృంగిపోతున్నారని, అదే ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ వలీ అహ్మద్ అన్నారు. టీఎస్ యూటీఎఫ్ చేపట్టిన ప్రచార జాత బుధవారం దుబ్బాకకు చేరుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు ల సంఖ్యను పెంచేందుకు తమ సంఘం కృషి చేస్తుందన్నారు. జిల్లాలోని 26 మండలాల్లో ‘బడి మనదే ఊరు మనదే అన్న’ఉద్దేశంతో ఈ ప్రచార జాత నిర్వహించామని చెప్పారు. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర నాయకులు యాదగిరి, వెంకటకిరణ్, కృష్ణ, రాంచంద్రం, నర్సింలు, యాదగిరి తదితరులు ఉన్నారు.

పంట నష్ట పరిహారం నిధులు విడుదల