సంగారెడ్డి జోన్: జిల్లాలో పన్ను వసూళ్లు లక్ష్యానికి చేరుకోలేదు. ఈసారి రూ.19,58,34,593 మేర పన్ను వసూలు లక్ష్యం ఉండగా రూ.18,12,22,831లు వసూలు అధికారులు చేయగలిగారు. అంటే ఈసారి 93% మాత్రమే పన్ను వసూళ్లయ్యాయి. ఈసారి గతంకంటే తక్కువగా పన్ను వసూలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో సంబంధిత అధికారులు ఇంటింటికీ తిరిగి పన్ను వసూలు చేసిన సంగతి తెలిసిందే.
తగ్గిన పన్ను వసూలు
జిల్లావ్యాప్తంగా 613 గ్రామపంచాయతీలున్నాయి. 2024–25లో రూ.23,53,58,096 వసూలు చేయాల్సి ఉండగా రూ.22,87,24,676లు వసూలు పూర్తి చేశారు. ఈ లెక్కన గతంలో కంటే ప్రస్తుతం లక్ష్యం తక్కువగా ఉన్నప్పటికీ వసూలు కూడా తగ్గింది. వసూలు చేసిన పన్ను సంబంధిత గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేస్తారు.
పర్యవేక్షణ లేకేనా!
పంచాయతీల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే పన్ను వసూలు అంతంతమాత్రంగానే జరిగిందని తెలుస్తోంది. జిల్లా పంచాయతీ అధికారి రెగ్యులర్ గా లేకపోవడంతోనే వసూలు శాతం గతేడాది కంటే ఈ సంవత్సరం తగ్గింది. జిల్లాలో కొన్నిచోట్ల పలువురు కార్యదర్శులు నిర్లక్ష్యం వహించగా మరికొన్ని చోట్ల తమ సొంత డబ్బులనే ఖాతాలో జమ చేసి వసూలైనట్లుగా ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలుస్తోంది.
ఆరు మండలాల్లో 100%
జిల్లాలో 25 మండలాలు ఉండగా ఆరు మండలాల్లో 100% పన్ను వసూలు చేశారు. హత్నూర, కంగ్టి, నిజాంపేట్, న్యాల్కల్, సదాశివపేట, సిర్గాపూర్ మండలాల్లోని గ్రామపంచాయతీలు వసూలు చేసిన వాటిలో టాప్లో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు పన్ను ద్వారా సమకూర్చుకున్న నిధులను గ్రామపంచాయతీ అభివృద్ధితోపాటు నిర్వహణ కోసం కేటాయిస్తారు. వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్యం, బోరు మోటార్ల మరమ్మతులతోపాటు ఇతర పనులకు వినియోగిస్తారు.
గతంకంటే తగ్గిన పన్ను వసూలు
పలుచోట్ల కార్యదర్శులే చెల్లింపులు
వసూలైన పన్ను పంచాయతీ ఖాతాల్లో


