నారాయణఖేడ్: హనుమాన్ జయంతి ఉత్సవాల ముగింపు పురస్కరించుకుని ఖేడ్ మండలం కొండాపూర్ హనుమాన్ ఆలయం సమీపంలో శుక్రవారం నిర్వహించిన కుస్తీ పోటీలకు మంచి స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలిరాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీలు కొనసాగాయి. చివరి కుస్తీ పోటీల్లో విజేతకు వెండి కడియాన్ని బహూకరించారు. కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి సంగ్రాం మహారాజ్, ఇరక్పల్లి పీఠాధిపతి దేవీదాస్ మహారాజ్, భక్తులు పాల్గొన్నారు.
డీపీఎం రమేశ్బాబు
సంగారెడ్డి టౌన్: మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడమే ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం ఉద్దేశమని డీపీఎం రమేశ్బాబు పేర్కొన్నారు. సంగారెడ్డిలోని శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతీ మహిళ ఆర్థికంగా స్థిరపడాలనే లక్ష్యంతో ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులను కుట్టడంలో శిక్షణనిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏడీ, సీసీలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంత రోడ్ల అనుసంధానంతోపాటు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఖేడ్ మండలం మూడుగుంటల్ జాతీయ రహదారి నుంచి సంజీవన్రావుపేట, కడ్పల్, సిర్గాపూర్ మీదుగా గౌడ్గాం వద్ద ఖేడ్–కంగి రోడ్డును అనుసంధానిస్తూ రూ.21 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన రవాణ సౌకర్యాలు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్ నుంచి సిర్గాపూర్, కంగ్టిలకు వెళ్లడానికి దగ్గరి రోడ్డుగా ఉండి వ్యయప్రయాసలు తప్పుతాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్రెడ్డి, ఆర్అండ్బీ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు ఖేడ్ పట్టణం ఏఎస్ నగర్ కాలనీలోని రాజరాజేశ్వరి శివాలయ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం
నిజాంపేట్ మండలం బాచేపల్లి గ్రామంలో పీఏసీఎస్, మార్క్ఫెడ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని సంజీవరెడ్డి ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే శనగలను విక్రయించి రూ.5,875 మద్దతు ధరను పొందాలని సూచించారు.
వట్పల్లి(అందోల్): అందోల్ మండల పరిధిలోని నేరడిగుంట చౌరస్తాలో ప్రతీ బుధవారం జరిగే సంతకు శుక్రవారం నిర్వహించిన వేలంపాటలో గ్రామపంచాయతీకి రికార్డుస్థాయిలో ఆదాయం లభించింది. 2026–27 ఏడాదికి గాను రికార్డుస్థాయిలో రూ.8.10 లక్షల ఆదాయం లభించింది. సంతవేలం పాటలో గ్రామానికి చెందిన ఎనిమిది మంది పాల్గొన్నారు. గొర్రెల సంతను సంగెం భానుప్రసాద్ రూ.4.60 లక్షలకు, కూరగాయాల సంతను మిద్దెల గాలిరెడ్డి రూ.3.30 లక్షలకు, ఎద్దుల మార్కెట్ను కె.దత్తు రూ.20 వేలకు వేలం పాటల ద్వారా దక్కించుకున్నట్లు ఇన్చార్జి పంచాయితీ కార్యదర్శి ప్రతాప్సింగ్ మీడియాకు తెలిపారు.


