మేకలు, గొర్రెలు, పాడిగేదెల పెంపకంతో లబ్ధి
● వారితోపాటు మరో నలుగురికి..
కంది(సంగారెడ్డి): ఉన్నత చదువులు చదివిన యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు రాకపోవడంతో పశువుల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే వనరులను వినియోగించుకుంటూ ఉపాధి కల్పిస్తున్నారు. కంది మండలం జిల్లా కేంద్రానికి, రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్కు దగ్గరగా ఉండటంతో పాడి పరిశ్రమకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మాంసం ఉత్పత్తి కోసం మేకలు, గొర్రెల పెంపకం కూడా లాభదాయకంగా ఉంటుందని, ఆ రంగం వైపు కూడా నిరుద్యోగ యువత ఆసక్తి కనబరుస్తున్నారు. రిటైర్ ఉద్యోగులు కూడా పశువుల పెంపకం చేపడుతున్నారు.
పలు గ్రామాల్లో ఏర్పాటు...
మండల పరిధిలోని మామిడిపల్లి, ఏర్దనూర్, బ్యాతోల్, ఆరుట్ల, కౌలంపేట్, చేర్యాల, జుల్కల్, కలివేముల, కాశీపూర్, ఇంద్రకరణ్, ఎద్దు మైలారం తదితర గ్రామాల్లో పాడి పశువుల పెంపకం చేపడుతున్నారు. అలాగే చర్లగూడెం, ఇప్పలగడ్డ తండా ఉత్తరపల్లి, ఏర్దనూరు తండాల్లో మేకలు, గొర్రెల పెంపకం చేపట్టి చదువుకున్న యువకులు జీవనోపాధి పొందుతున్నారు. సొంత గ్రామాల్లోనే జీవనోపాధి పొందేందుకు తగిన అవకాశాలు ఉండటంతో పశువుల షెడ్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం కూడా ఉపాధి హామీ పథకం ద్వారా షెడ్లు నిర్మించుకునేందుకు సబ్సిడీ ఇస్తోంది. గేదెల నుంచి వచ్చిన పాలను మండలంలో గల ఓడీఎఫ్, ఐఐటీ హైదరాబాద్తోపాటు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మిల్క్ సెంటర్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వం ఆధ్వర్యంలోని విజయ డెయిరీకి పాలను విక్రయించి లబ్ధి పొందుతున్నారు. మేకలు, గొర్రెల మాంసానికి అధిక డిమాండ్ ఉండటంతో తమకు లాభదాయకంగానే ఉందని పెంపకందారులు చెబుతున్నారు.


