తూప్రాన్: పట్టణంలోని రామాలయం రథోత్సవ వేడుకలు పోలీసు బందోబస్తు మధ్య ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి వేడుకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య రథోత్సవంపై కూర్చోవడం విషయంలో విభేదాలు చోటు చేసుకోవడంతో డీఎస్పీ నరేందర్గౌడ్ ఆధ్వర్యంలో 80 మంది పోలీసులు ఇరువర్గాలకు చెందిన నాయకులను ఉదయం హౌస్ అరెస్టు చేశారు. వివరాలు ఇలా... శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో జాతర ఉత్సవాల అనంతరం రథోత్సవం నిర్వహిస్తారు. ఈ రథోత్సవంపై పంచాయతీ నుంచి మున్సిపల్ ఏర్పడినప్పటి నుంచి సర్పంచ్, మున్సిపల్ చైర్మన్ కూర్చోవడం అనవాయితీగా వస్తుంది. కాగా రెండేళ్ల నుంచి ఆలయ కమిటీ సభ్యులు రథోత్సవంపై పూజారి మినహా మరెవ్వరూ కూర్చోవద్దని తీర్మానం చేశారు. అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రజినీ చైర్పర్సన్గా గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు, కమిటీ సభ్యులు రథోత్సవంపై మున్సిపల్ చైర్పర్సన్ రజినీ కూర్చోవద్దని తెలిపారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్పీ నరేందర్గౌడ్ ఇరువర్గాలతో గురువారం రాత్రి చర్చించారు. ఎవరూ వెనుకంజ వేయకపోవడంతో చైర్పర్సన్ రజని రాఘవేందర్గౌడ్తో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్టు చేశారు. అనంతరం ఎలాంటి అల్లర్లు చేయమని హామీ ఇవ్వడంతో వేడుకలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. కాగా పోలీసు ప్రత్యేక బలగాలను రప్పించారు. పోలీసు బందోబస్తు మధ్య రథోత్సవ వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.


