కేతకీ దర్శనం.. సర్వపాపహరణం
సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న ఆలయం భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు 5 లక్షల మంది తరలివచ్చే అవకాశం
నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఝరాసంగం(జహీరాబాద్): తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలలో శ్రీ కేతకీ సంగమేశ్వరుడిని ఇంటి దైవంగా కొలుస్తారు. శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో ఉన్న అమృతగుండంలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల అంచంచల విశ్వాసం. ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. శివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించనున్న శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రతీ ఏటా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. బుధవారం నుంచి తొమ్మిది రోజులపాటు నిర్వహించే వేడుకలతో ఆధ్యాత్మికత సంతరించుకుంటుంది. మొదటి రోజు శిఖర పూజతో ప్రారంభమై బిళ్వార్చనతో ముగుస్తుంది. బుధవారం శిఖర పూజ, అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈసారి ఆలయానికి 5 లక్షల వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ముమ్మరంగా ఏర్పాట్లు
జాతర సమీపిస్తుండటంతో భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే రహదారుల మరమ్మతుల పనులు పూర్తికావస్తున్నాయి. త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల మరమ్మతులు, ఆలయానికి రంగులు వేయటం వంటి పనులు జోరుగా సాగుతున్నాయి. జహీరాబాద్ నుంచి ఆలయం వరకు ఆర్టీసీ బస్సులు నడుపుతారు.
కేతకీ దర్శనం.. సర్వపాపహరణం


