ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
గజ్వేల్రూరల్: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని బెజుగామలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎంకమొల్ల భిక్షపతి(56) వ్యవసాయం చేసుకుంటూ, గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గంలేక మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో తమ గొర్లదొడ్డి వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. కానీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గొర్లదొడ్డి వద్దకు వెళ్ళి చూడగా ఉరివేసుకొని ఉండటం గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిన్న పరిశ్రమల స్థాపనకు ఆర్థికసాయం
జహీరాబాద్ టౌన్: నాన్ ఫార్మా రంగంలో చిన్న తరహా పరిశ్రమల స్థాపనం కోసం మహిళా సంఘాలకు రుణం సహాయం అందిస్తామని సెర్ప్ రాష్ట్ర (నాన్ఫార్మ్) డైరెక్టర్ జాన్సన్ పేర్కొన్నారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం చెక్క బొమ్మలను తయారుచేసే మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వ్యవసాయేతర రంగంలో స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడానికి భారీ రుణ సాయం అందిస్తున్నట్లు చెప్పారు. చెక్క బొమ్మలను తయారుచేసే వారు సంఘంగా ఏర్పడి పరిశ్రమ స్థాపనం కోసం ముందుకు వస్తే రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఈ నిధులతో షెడ్డు, మెషీనరీలు తదితర పరికరాలను కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారు. సమావేశంలో అధికారులు నాగరాజు, సునీల్, డీపీఎం రమేష్, ఏపీఎం విశేశ్వర్గౌడ్ మహిళలు పాల్గొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య


