తప్పిపోయిన వృద్ధురాలి అప్పగింత
సిద్దిపేటఅర్బన్: తప్పిపోయిన వృద్ధురాలిని పోలీసులు ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సిద్దిపేట త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు కథనం ప్రకారం... టీహెచ్ఆర్ నగర్కు చెందిన సలేంద్ర హనుమవ్వ (80) ఈ నెల 5న ఉదయం 7 గంటలకు తన కూతురు మామిండ్ల కనకవ్వ ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. కూతురు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి వద్ద వెతకగా ఆచూకీ లభించలేదు. దీంతో 7వ తేదీన కూతురు కనకవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, వృద్ధురాలు ఆటోలో ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. కాగా మాజీ ఆర్మీ జవాన్ నాగప్రసాద్ వృద్ధురాలిని వృద్ధాశ్రమంలో చేర్పించారు. పోలీసులు వృద్ధురాలిని తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. చురుగ్గా వ్యవహరించిన పోలీసులు, కమాండ్ కంట్రోల్ రూం సిబ్బందిని సీపీ అభినందించారు.


