వాణిజ్య ఒప్పందాలు బయటపెట్టాలి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాములు
గజ్వేల్రూరల్: కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలను పార్లమెంట్లో బయటపెట్టాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. సీఐటీయూ రైతు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త నిరసనలో భాగంగా సోమవారం గజ్వేల్ పట్టణంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల దిగుమతుల సుంకం తొలగించిందనడంతో ఆపిల్ రైతులకు మార్కెట్లో ధర లేదన్నారు. పత్తి కొనుగోళ్లు కూడా ఆన్లైన్ చేయడంతో ధర తగ్గించారని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగం దివాలా తీస్తుండగా, కార్మిక రైతాంగాన్ని తాకట్టు పెట్టిందని ఆరోపించారు. ఈనెల 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు, రైతాంగం పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, నాయకులు రంగారెడ్డి, స్వామి, నాగరాజు, మల్లేశ్, రాజు, సంజీవులు, ప్రవీణ్ పాల్గొన్నారు.


