అనర్హతే..
నిబంధనలు అతిక్రమిస్తే
● అభ్యర్థులూ.. తస్మాత్ జాగ్రత్త
● పత్రాలతో ఉరుకులు పరుగులు
● మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి
నిబంధనలివీ..
కౌన్సిలర్ బరిలో నిలబడే అభ్యర్థులు కనీసం 21 సంవత్సరాలు నిండి, మున్సిపాలిటీ పరిధిలో ఓటరై ఉండాలి. అతన్ని ప్రతిపాదించే వ్యక్తి సైతం స్థానికుడై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రాలను జత చేయాలి. ఇద్దరు సాక్షులతో కలిసి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అందులో విద్యార్హత, కుటుంబ ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర తదితర వివరాలను రాయాలి. అభ్యర్థి సొంత వార్డు కాకుండా ఇతర వార్డులో పోటీచేస్తే మరిన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఎలాంటి బకాయిలు ఉండొద్దు
ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థి పేరిట ఎలాంటి బకాయిలు ఉండకూడదు. ఇంటి పన్నులు, నీటి పన్నులు, కరెంట్ బిల్లులు, బ్యాంకు రుణాలు వంటి ఎలాంటి బకాయిలు క్లియరెన్స్ ఉండాలి. అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి, సాక్షులుగా ఉండే ఇద్దరు వ్యక్తుల పేరున కూడా ఎలాంటి బకాయిలుండొద్దు. ప్రభుత్వ రుణాలు పెండింగ్ లేకుండా చూసుకోవాలి. బకాయిలు ఉంటే స్క్రూటినిలో నామినేషన్ తిరస్కరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు పోటీలో ఉండకూడదు. ఉండాలంటే ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
ఒక్క వార్డు నుంచే పోటీచేయాలి
ఒక అభ్యర్థి అతని మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ని వార్డుల్లోనైన నామినేషన్లు దాఖలు చేయవచ్చు. కానీ పోటీ మాత్రం ఒక్క వార్డు నుంచే చేయాలి. స్క్రూటిని అనంతరం ఇతర నామినేషన్లు అన్ని ఉపసంహరించుకొని ఒక్క వార్డును ఎంపిక చేసుకోవాలి. రెండు వార్డుల్లో నామినేషన్ వేసి మర్చిపోయినా.. వాటిని ఉప సంహరించుకోక పోయిన అభ్యర్థి పోటీలో నిలబడే అర్హత కోల్పోతారు.
డిపాజిట్ ఎంత?
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1250, ఓసీలు రూ.2500లు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల అనంతరం అభ్యర్థులు సాధించిన ఓట్ల ఆధారంగాా డిపాజిట్ డబ్బులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. డిపాజిట్ సాధించకుంటే డబ్బులు ఇవ్వరు. అభ్యర్థులు రాయితీ పొందాలంటే తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం సమర్పించాలి. తప్పనిసరిగా ఏదైన ఒక బ్యాంకు నుంచి కొత్తగా అకౌంట్ తీసి వివరాలు ఇవ్వాలి. ఎన్నికల ఖర్చులకు మొత్తం ఆ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు వాడాలి. ఎన్నికల అనంతరం తప్పనిసరిగా ఖర్చుల వివరాలు ఎన్నికల అధికారులకు అందజేయాలి.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో మున్సిపాలిటీల్లో సందడి నెలకొంది. నామినేషన్లకు కేవలం మూడు రోజులే అవకాశం కల్పించారు. దీంతో ఆశావాహులు అర్హత పత్రాల సేకరణకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇదే సమయంలో కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నామినేషన్ పత్రాలను ఒకటికి పదిసార్లు పరిశీలించుకోవాలి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కమిషన్ అడిగిన అన్ని పత్రాలు సమర్పించాలి. అందులో ఏ ఒక్క సర్టిఫికెట్ నామినేషన్ పత్రంలో జత చేయక పోయినా.. తిరస్కరణకు గురవుతుంది. –మెదక్ కలెక్టరేట్
అభ్యర్థులు నామినేషన్ పత్రంలోని ఫారం –2లో పూర్తి వివరాలు నింపాలి. ప్రధానంగా అభ్యర్థి తన ఇంటి పూర్తి పేరుతో రాయాలి. ఇతర పూర్తి వివరాలను తప్పనిసరిగా నింపాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రంపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి. ఆధార్కార్డు, ఓటరు కార్డుతోపాటు ఆస్తి పన్నులు, నీటి పన్నుల క్లియరెన్స్ పత్రాలు, ముఖ్యంగా మున్సిపాలిటీ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ పొంది దానిని నామినేషన్ వెంట జత చేయాలి.


