ఎందుకు ఇలా..?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సుమారు 80 శాతానికి పైగా సర్పంచ్ స్థానాలు ఆ పార్టీ మద్దతుదారులే గెలుచుకున్నారు. అప్పట్లో వార్ వన్సైడ్ అన్నట్లుగా ఉండేది. కానీ.. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయిలో ఎందుకు సర్పంచ్ స్థానాలు రావడం లేదు..? పలు మండలాల్లో బీఆర్ఎస్ నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ పడుతోంది.. ఈ పరిస్థితి ఎందుకు కొనసాగుతోంది. అధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ.. అప్పట్లో బీఆర్ఎస్కు వచ్చిన మాదిరిగా ఫలితాలు ఏకపక్షంగా ఇప్పుడు ఎందుకు రాలేదు. ఈ అంశాలపై అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు అంతర్గతంగా సమీక్షించుకుంటున్నారు. రెండు విడతల్లో వచ్చిన ఫలితాలపై ఆయా నియోజకవర్గాల ముఖ్యనాయకత్వం అంశాలపై దృష్టి సారించింది. ఈ నెల 11న తొలి విడతలో ఎన్నికలు జరిగిన 136 గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా..నేనా అన్నట్లు పోటీ పడిన విషయం తెలిసిందే. అధికారంలో లేకపోయినప్పటికీ.. గులాబీ పార్టీ మద్దతుదారులు గట్టి పోటీని ఇచ్చారు. మొత్తం 136 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు గాను ఏకగ్రీవాలు కలుపుకొని సుమారు 48 వరకు సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. అంటే సుమారు 35 శాతం సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సుమారు 52 శాతం సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో కూడా సుమారు 33 శాతం గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలను గులాబీ పార్టీ మద్దతుదారులు కై వసం చేసుకున్నారు. 60 శాతం పంచాయతీల్లో సర్పంచులుగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పట్టునిలుపుకొన్న గులాబీ పార్టీ ఇప్పుడు పల్లె సంగ్రామంలోనూ కాంగ్రెస్తో హోరాహోరీగా తలపడుతోంది.
మూడో విడతపై ఫోకస్
తొలి రెండు విడతల్లో బీఆర్ఎస్తో పోల్చితే కాస్త ఆధిక్యాన్ని సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు మూడో విడత గ్రామ సర్పంచ్ స్థానాలపై ఫోకస్ పెట్టింది. ఈనెల 17న జరిగే చివరి విడత పోలింగ్ కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో జరుగుతోంది. జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క న్యాల్కల్ మండలం ఉంది. దీంతో ఈ మూడో విడత పల్లె పోరులో ఎన్ని సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎలాగైనా పట్టు నిలుపుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.
రెబల్స్ లేకుండా పెరిగేవేమో..
చాలా గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్స్ అభ్యర్థులు సర్పంచులుగా బరిలోకి దిగారు. దీంతో పార్టీ ఓట్లు చీలిపోయాయి. ఇది చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలు ఈ రెబల్స్ అభ్యర్థులతో మాట్లాడి నామినేషన్లు ఉపసంహరణ చేసి ఉంటే సర్పంచ్ స్థానాలు మరిన్ని పెరిగే అవకాశాలుండేవని ఆ పార్టీ భావిస్తోంది.
ఆ స్థాయిలో స్థానాలు ఎందుకు రావడం లేదు
రెండు విడతల ఫలితాలపై కాంగ్రెస్ ఆరా
బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చిన మండలాల్లో
పరిస్థితి ఎలా ఉంది..?
రెబల్స్ లేకపోయి ఉంటే మరిన్ని స్థానాలు పెరిగేవని కాంగ్రెస్ అంచనా
రేపు జరిగే మూడో విడతపై ఫోకస్
ఎందుకు ఇలా..?


