ప్రమాదాలు జరిగితేనే తనిఖీలు చేస్తారా? | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాలు జరిగితేనే తనిఖీలు చేస్తారా?

Oct 26 2025 9:17 AM | Updated on Oct 26 2025 9:17 AM

ప్రమాదాలు జరిగితేనే తనిఖీలు చేస్తారా?

ప్రమాదాలు జరిగితేనే తనిఖీలు చేస్తారా?

మెదక్‌జోన్‌: బస్సు ప్రమాదాలు జరిగితేనే తనిఖీలు గుర్తుకువస్తాయా..? అని ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. శనివారం మెదక్‌ ఐబీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రమాదాలు చోటు చేసుకోగానే హడావుడిగా తనిఖీలు చేసే అధికారులు ఆ తర్వాత మరిచిపోవటం ఎంతవరకు సమంజసం అన్నారు. కర్నూలు బస్సు ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ప్రైవేట్‌ వాహనాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2047 వరకు వికసిత్‌ భారత్‌ మోదీ లక్ష్యమని గుర్తు చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్‌, నాయకులు నందారెడ్డి సిద్దిరాములు, శ్రీపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇబ్బందులు లేకుండా

ధాన్యం కొనాలి

నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి

హత్నూర(సంగారెడ్డి): రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని తెలిపారు. గన్నీ బ్యాగులతో పాటు హమాలీలను కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు ఆరబెట్టి తెచ్చిన ధాన్యాన్ని తూకం వేసి వెంటనే రైస్‌ మిల్లులకు పంపించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ డీపీఎం రమేశ్‌, తహసీల్దార్‌ పర్వీన్‌ షేక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ దుర్గారెడ్డి, అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు రాష్ట్ర మాజీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, ఏపీఎం రాజశేఖర్‌, సొసైటీ డైరెక్టర్‌ రాములు, బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పశువులకు టీకాలు తప్పనిసరి

పటాన్‌చెరు టౌన్‌: గాలికుంటు నివారణ టీకాలను పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ వసంత కుమారి సూచించారు. శనివారం అమీన్‌పూర్‌ మండలంలోని వడక్‌పల్లి, కిష్టారెడ్డిపేటలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏటా ప్రభుత్వం గాలి కుంటు వ్యాధి రాకుండా పశువులకు ఉచితంగా టీకాలను అందిస్తుందన్నారు. జిల్లావ్యాప్తంగా టీకాల పంపిణీ కార్యక్రమం వచ్చేనెల 15 వరకు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి ప్రదీప్‌కుమార్‌, సహాయకుడు సత్యనారాయణ పాల్గొన్నారు.

వైద్యానికి మూలం ఆయుర్వేదం

సంగారెడ్డి టౌన్‌: ఆరోగ్య సమస్యల పరిష్కారానికి భారతీయ ఆయుర్వేదం సంపూర్ణ పరిష్కారాలు సూచిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. శనివారం ధన్వంతరి జయంతి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి విద్యానగర్‌ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనారోగ్య సమస్యలతో ఇతర దేశాల నుంచి మన దేశంలోని ఆయుర్వేద ప్రకృతి వైద్యశాలలకు వస్తున్న ప్రజలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఎంఎన్‌ఆర్‌ ఆసుపత్రి సిబ్బంది వైద్య సేవలను అభినందించారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి న్యాయసేవలను అందించడం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి నాయీ బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షుడు దత్తాత్రి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సాయినాథ్‌, ఎంఎన్‌ఆర్‌ ఆస్పత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement