
దైవదర్శనానికి వెళ్లొస్తుండగా..
అబ్దుల్లాపూర్మెట్ / జిన్నారం (పటాన్చెరు): స్నేహితులంతా కలిసి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగ్రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి మృతిచెందగా ముగ్గురికి తీవ్ర, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిఽధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామానికి చెందిన రాళ్లకత్వ వెంకటేశ్వర్ రెడ్డి కూతురు సౌమ్యారెడ్డి (25) నగరంలోని ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. తన స్నేహితులైన నందకిశోర్, వీరేంద్ర, ప్రణీష్, సాగర్, అరవింద్, ఝాన్సీ, శృతితో కలిసి ఆదివారం కారులో రాచకొండ సమీపంలోని సరళ మైసమ్మ దేవాలయానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో రాత్రి బొంగ్లూర్ వద్ద ఔటర్పై నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో బలిజగూడ సమీపంలోకి రాగానే భారీగా కురుస్తున్న వర్షం కారణంగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో సౌమ్యారెడ్డితో పాటు పలువురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సౌమ్యారెడ్డి చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందింది. మరో ముగ్గురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా దర్శనానికి అని వెళ్లిన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు, అక్క రమ్యారెడ్డి కన్నీరు మున్నీరయ్యారు. సౌమ్యారెడ్డి మృతితో వావిలాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
డివైడర్ను ఢీకొట్టి ఔటర్పై కారు బోల్తా
యువతి మృతి, ఏడుగురికి గాయాలు

దైవదర్శనానికి వెళ్లొస్తుండగా..