
నిరంతర విద్యుత్ సరఫరాకు సన్నద్ధం
● ఈ ఏడాదిలో మార్చి 28నఅత్యధిక విద్యుత్ వినియోగం ● అత్యవసర సేవలకు 8 వాహనాలు ● ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 1912
సంగారెడ్డి : నిరంతర విద్యుత్ సరఫరాకు విద్యుత్ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో అత్యధికంగా విద్యుత్ వినియోగం అయినట్లు అధికారులు చెప్తున్నారు. గతేడాది మార్చి 28న 775 మెగావాట్ల యూనిట్లు ఖర్చయితే ఈ ఏడాది మార్చి 28న 830 మెగావాట్ల విద్యుత్ వాడకం జరిగినట్లు విద్యుత్ శాఖాధికారులు తెలిపారు. అంటే 55 మెగావాట్ల విద్యుత్ అధికంగా వాడకం జరిగినట్లు వెల్లడిస్తున్నారు. ఇందుకు కారణం ఉచిత కరెంట్ అని తెలుస్తోంది. దీంతో విద్యుత్ అధికారులు అత్యవసర పనులకు మొబైల్ వాహనాలు ఏర్పాటు చేశారు. వర్ష కాలం కావడంతో ఈదురు గాలులు వర్షాలకు తరుచు విద్యుత్ అంతరాయం కలుగుతుంది .ఇలాంటి సమయంలో వినియోగదారులు ఫోన్ చేసి ఫిర్యాదుచేసినా సిబ్బంది చేరుకునేసరికి ఆలస్యమవుతోంది. ఇకమీ దట ఆ ఇబ్బందులు దూరం కానున్నాయి.
త్వరలోనే మొబైల్ వాహనాలు
జిల్లాలో ప్రతీ సబ్ డివిజన్ ఒక మొబైల్ వాహనం ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలో 8 మొబైల్ వాహనాలు సేవలు అందిస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. మరో మొబైల్ వాహనం త్వరలోనే రానుంది. ఈ వాహనాలతో విద్యుత్ సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు. ఎవరైనా సమస్యలు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేసి పరిష్కరించుకోవాలి.
నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యం
నిరంతర విద్యుత్ సరఫరాను లక్ష్యంగా పెట్టుకున్నాం. వర్షాకాలం దృష్ట్యా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం . ప్రత్యేక వాహనాలతో విద్యుత్తు సేవల మెరుగుకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే జిల్లాలో రెండు వాహనాలు సేవలు అందిస్తున్నాయి. 1912 టోల్ ఫ్రీ నంబరు సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీనాథ్,
విద్యుత్ శాఖ ఎస్ఈ, సంగారెడ్డి
అత్యవసర పనుల్లో కొన్ని ...
టోల్ ఫ్రీనంబర్ 1912కు కాల్ చేస్తే బ్రేక్ డౌన్ సమస్యలపై తక్షణ మరమ్మతులు.
ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల వేగవంతం.
తెగిపోయిన తీగలు బిగింపు.
గాలివానల కారణంగా సరఫరాలో అంతరాయం తలెత్తినప్పుడు వెంటనే స్పందించడం.
సమస్యలు తలెత్తి స్తంభాలు కిందపడి
పోతే వెంటనే సరిచేయడం.
తీగలపై చెట్లు పడితే తక్షణ తొలగింపు
తదితర పనులు చేస్తారు.