దుబ్బాక: రాష్ట్ర స్థాయిలో విద్యా పరిశోధన శిక్షణ సంస్థ(ఎస్ఈఆర్టీ) నిర్వహించే ఉత్తమ అభ్యసన ప్రక్రియకు మండలంలోని గంభీర్పూర్ పాఠశాల ఉపాధ్యాయురాలు మాధవి ప్రదర్శన ఎంపికైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నూతన అభ్యసన ప్రక్రియను జిల్లాస్థాయిలో నిర్వహించి ఇందులో ఉత్తమ ప్రదర్శనలు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించాలని ప్రభుత్వం సూచించింది. ఈ నెల 24నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు తమ ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో ఉపాధ్యాయురాలు మాధవి ప్రదర్శించిన ఉత్తమ అభ్యసన ప్రక్రియ (బెస్ట్ ప్రాక్టీస్) రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.
అబుదాబి వేడుకలకు అందె భాస్కర్
మిరుదొడ్డి(దుబ్బాక): తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఇండియా నంబర్స్ సంయుక్త ఆధ్వర్యంలో దుబాయ్లోని అబుదాబిలో నిర్వహించే రాష్ట్ర 11వ అవతరణ వేడుకలకు మండల పరిధిలోని అందె గ్రామానికి చెందిన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ డప్పు వాయిద్య కళాకారుడు అందె భాస్కర్ ఎంపికయ్యాడు. అబుదాబిలో జరిగే వేడుకల్లో ఆయన తన డప్పు కళాబృందం సభ్యులతో కలిసి కళా ప్రదర్శనలు ఇవ్వనున్నాడు.
బూటకపు ఎన్కౌంటర్పై విచారణ జరపాలి
సీపీఐ నేత చాడ డిమాండ్
హుస్నాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ పేరిట జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని సీపీఐ భవన్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చర్చలకు ఆహ్వానించిన మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా చంపడం దారుణమన్నారు. చిత్రహింసలు పెట్టి కనీసం మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పగించకుండా దహన సంస్కారాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
శాంతి చర్చలు జరపాలని సీపీఐ అగ్రనేతలు, పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘాలు కోరినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని పోరాడితే సీపీఐ కార్యకర్తలపై కేసులు పెట్టారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర సమితి సభ్యుడు మల్లేశ్, వనేష్ తదితరులు ఉన్నారు.
ప్రాణం తీసిన టూవీలర్ ఫైనాన్స్
చికిత్స పొందుతూ మహిళ మృతి
అక్కన్నపేట(హుస్నాబాద్): టూవీలర్ ఈఎంఐ కట్టలేదని, ద్విచక్ర వాహనాన్ని ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ మహిళ పురుగుల మందు తాగి మృతి చెందింది. ఎస్ఐ విజయ్భాస్కర్ వివరాల ప్రకారం... అంత్కపేట గ్రామానికి చెందిన జంగపల్లి అయిలయ్య తన చిన్న కుమారుడు శ్రీధర్ కోసం హోండా యాక్టివాను ఫైనాన్స్లో కొనుగోలు చేశాడు. నెల నెలా కట్టాల్సిన ఈఎంఐని సరిగా కట్టడం లేదని, ఫైనాన్స్కు చెందిన వ్యక్తులు ద్విచక్రవాహనాన్ని తీసుకెళ్లారు.
ఇంటికి వచ్చిన ఐలయ్య వాహనం తీసుకెళ్లిన విషయాన్ని తన ఎందుకు చెప్పలేదని భార్య మొండమ్మ(57)పై కోపపడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ నెల 27న రాత్రి ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగింది. దీంతో హుటాహుటిన హుస్నాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్తమ అభ్యసనకు ఎంపిక