
వైద్యుడికి మెమో జారీ
చేర్యాల(సిద్దిపేట): ఈ నెల 1న రాత్రి ఆస్పత్రికి వచ్చిన రోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తిపై వచ్చిన ఫిర్యాదుపై డీసీహెచ్ విచారణ జరిపి బుధవారం వైద్యుడికి మెమో జారీ చేశాడు. మెమోను స్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవేందర్ వైద్యుడికి అందజేశాడు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఉన్నతాధికారులు జారీ చేసిన మెమో వైద్యుడికి అందించామని, దీనిపై సదరు వైద్యుడు ఇచ్చిన వివరణ ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు తెలిపారు.
చేపలు పట్టేందుకు వెళ్లి
వ్యక్తి మృతి
చేగుంట(తూప్రాన్): చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మాసాయిపేట మండలం కొప్పులపల్లి వాగులో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి వివరాల ప్రకారం... తూప్రాన్ పట్టణానికి చెందిన జోగు బాబు(30) కొప్పులపల్లి వాగులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చేపల వల బాబుకు చుట్టుకొని నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో గేదె మృతి
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని రాజీపేటలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుదాఘాతానికి గురై గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన బక్తుల యాదాగౌడ్ రోజు మాదిరిగా గేదెలను బుధవారం ఉదయం సైతం మేతకు వదిలాడు. గ్రామ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద వైర్ తెగిపోయి ఉండటంతో అటుగా వెళ్లిన పాడిగేదె విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ సుమారు రూ.60వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. కాగా వాటిని కాస్తున్న వ్యక్తి గమనించి దూరంగా వెళ్లడంతో ప్రమాదం తప్పింది.
వ్యక్తి అదృశ్యం
నర్సాపూర్ రూరల్: ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. నర్సాపూర్ ఎస్సై లింగం కథనం ప్రకారం.. మండల పరిధిలోని తుల్జారంపేటకు చెందిన పాతులోత్ సంతోష్ను తండ్రి గోపాల్ పనిచేసిన కూలీ డబ్బులు ఇవ్వాలని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన అతడు మార్చి 9వ తేదీన సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. మరుసటి రోజు అతడు స్నేహితులకు ఫోన్ చేసి కొన్ని రోజులపాటు ఇంటికి వెళ్లనని చెప్పడంతో కుటుంబ సభ్యులు తిరిగి వస్తాడులే అనుకొని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కొన్ని రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతోపాటు వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు
చేర్యాల(సిద్దిపేట): గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ నీరేష్తో కలిసి సీఐ ఎల్.శ్రీను కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులో కొందరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ఫోర్స్, చేర్యాల పోలీసులు రైడ్ చేసి సింగసారం మహేష్, రంగు రాజు, సార్ల నవీన్లను అరెస్టు చేశారు. వారిని విచారించగా హైదరాబాద్ దూల్పేటకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 100 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, మూడుసెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్ తరలించినట్లు తెలిపారు.

వైద్యుడికి మెమో జారీ

వైద్యుడికి మెమో జారీ