● పూడిక మట్టి వేసుకుంటున్న రైతులు ● ఆర్థికంగా భారమైనా ముందడుగేస్తున్న అన్నదాతలు ● భూసార పరీక్షలు చేయించి వేస్తే మేలు ● మారుతున్న భూముల రూపురేఖలు
కంగ్టి(నారాయణఖేడ్): రాళ్లతో కూడిన గట్టు భూములు, చెలుక మట్టి, ఎర్ర రేగడి భూములు పూడిక మట్టితో నల్లరేగడి భూములుగా మారుతున్నాయి. ఖేడ్ డివిజన్లో కంగ్టి, సిర్గాపూర్, నాగల్గిద్ద, మనూరు, నారాయణఖేడ్ మండలాల్లో అధికంగా రాళ్లు రప్పలతో కూడిన భూములున్నాయి. గతంలో పూడిక మట్టి తోడాలంటే భయపడే రైతులు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం పుణ్యమా అని వచ్చిన అవకాశం వదులు కోకుండా భూముల రూపురేఖలు మార్చేస్తున్నారు.
ఎకరాకు దాదాపు లక్ష ఖర్చు..
చెరువులోని పూడిక మట్టి కోసం దూరాన్ని బట్టి, జేసీబీతో లోడింగ్ సహా ప్రతీ ట్రిప్పు టిప్పర్కు రూ.2500 నుంచి రూ.3వేల వరకు చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. దీంతో ఎకరా విస్తీర్ణంలో దాదాపు 35 నుంచి 40 ట్రిప్పులు వేయిస్తున్నారు. ఇది వ్యవసాయాధికారులు సూచించిన దాని కంటే దాదాపు ఐదింతలు అధికంగా ఉంటుంది. దీంతో భూములకు లక్షల రూపాయలు ఖర్చు చేసి సారవంతంగా మారుస్తున్నారు. మండలంలోని దామర్గిద్ద కాకివాగు ప్రాజెక్టు, ముర్కుంజాల్ సాములు వాగు ప్రాజెక్టు, తడ్కల్ పెద్ద చెరువు, ఘన్పూర్ చెరువు, చాప్టా కొత్త చెరువులలోని పూడిక మట్టిని రాళ్ల భూములకు తరలిస్తున్నారు.
భూసార పరీక్షల ఆధారంగా పూడిక మట్టి వేసుకోవాలి
రైతులు భూముల్లో పూడిక మట్టి వేసే ముందు భూసార పరీక్షలు చేయించుకొని పోషకాలకు అనుగుణంగా వేసుకోవాలని ఏడీఏ తెలిపారు. రైతులకు కింది సూచనలు చేశారు.
చెరువు మట్టి చేనుకు బలమే అయినా ఎకరాకు 20 నుంచి 25 ట్రాక్టర్ ట్రిప్పులు మాత్రమే వేసుకోవాలి.
ముఖ్యంగా ఎండాకాలం మే నెలలో మాత్రమే పూడిక మట్టి చెరువులో రెండు నుంచి మూడు అడుగులు మాత్రమే తోడాలి.
విచ్చలవిడి రసాయన ఎరువుల వాడకంతో భూమిలో పోషకాల లోపం విపరీతంగా కన్పిస్తుంది.
రసాయన ఎరువుల కన్నా పూడికలో పోషకాలు మెండు.
పూడికతో నీటి నిల్వ సామర్థ్యం 4 నుంచి 7 శాతం పెరుగుతుంది.
పూడిక వేయడంతో పంటలకు రోగ నిరోధకశక్తి పెరగడంతో పాటు మిత్ర పురుగులు పెరిగి పంట దిగుబడులు అధికంగా వస్తాయి.
లోపిస్తున్న పోషకాల సమతుల్యత
పంటలకు కావాల్సిన ప్రధాన పోషకాలు భాస్వరం, నత్రజని, పొటాష్ నిల్వలు చెరువు పూడిక మట్టిలో పుష్కలంగా ఉన్నాయి. రైతులకు పూడిక మట్టి అందుబాటులో ఉండటంతో తమ ఇష్టానుసారంగా రాళ్లు, చెలుకలు, చౌడు భూముల రూపు రేఖలు మారుస్తూ నల్లరేగడి నేలలుగా మారుస్తున్నారు. మండలంలో గట్టు భూములు అధికంగా ఉండటంతో తేమను నిల్వ ఉంచే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దీంతో పంటల దిగుబడి సక్రమంగా రావడం లేదని రైతులు భూముల్లో రెండు అడుగుల ఎత్తు వరకు రేగడి పూడిక మట్టిని వేస్తున్నారు. అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు పోటీ పడటం మంచి పరిణామం. అయినా అధిక మోతాదులో పూడిక మట్టి వేయడం వల్ల పోషకాల సమతుల్యత లోపించి పంటలకు నష్టం కూడా జరిగే ప్రమాదం లేకపోలేదు. – నారాయణఖేడ్, ఏడీఏ నూతన్కుమార్
రాళ్ల భూములు.. నల్ల రేగళ్లు
రాళ్ల భూములు.. నల్ల రేగళ్లు