
అర్ధరాత్రి ఆగడాలకు చెక్
ఇకపై ఆకతాయిల పనిపడతాం
● శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి ● 24 గంటలు గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ● పాత నేరస్తులపై పటిష్ట నిఘా
సంగారెడ్డి క్రైమ్: పట్టణంలో ఆకతాయిల ఆటలకు ఇకపై పోలీసులు చెక్ పెట్టనున్నారు. అర్ధరాత్రి దొరికితే జైలుకే. జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇప్పటికే అర్ధరాత్రి తర్వాత ప్రధాన రహదారులు, పబ్లిక్ ప్రదేశాల్లో యువకులు బర్త్డే అంటూ కొందరు, రెస్టారెంట్కి వెళ్తామని మరికొందరు, ఏ పని లేకుండా తిరుగుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. శాంతి భద్రతల దృష్ట్యా నిత్యం 24 గంటలు పెట్రోలింగ్ వాహనంతో పాటు, బ్లూ కోర్ట్సు పోలీస్ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి ద్విచక్ర వాహనదారులు, కార్లలో తమ ఇష్టానుసారంగా పబ్లిక్ ప్రదేశాల్లో వ్యవహరిస్తున్న తీరుపై పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. స్నేహితులతో కలిసి ఇక ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరగడం కుదరదు. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పలు కాలనీల్లో రాత్రి 12 తర్వాత తిరుగుతున్న వారిని పట్టుకుని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. వారి వద్ద నుంచి ఫింగర్ప్రింట్ , సంబంధిత వివరాలు తీసుకుంటున్నారు.
కొన్ని ఘటనలు...
సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఏప్రిల్ 15న అర్ధరాత్రి ఓ కుటుంబం ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గమాధ్యలో గుర్తుతెలియని యువకులు బైకుపై వచ్చి మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. తన కళ్ల ముందే అడ్డుకోబోయిన భర్తపై తీవ్రంగా దాడి చేశారు.
● కొద్ది నెలల క్రితం మెడికల్ దుకాణాలే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతూ ఓ దొంగ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. ఈ కేసును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు 20రోజుల్లో నిందితుడిని పట్టుకున్నారు. వరుస చోరీలు పాల్పడుతున్న పాత నేరస్తుడైన ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించి, అరెస్టు చేసి జైలుకు పంపించారు.
● కొంతమంది యువకులు అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత కూడా మహబూబ్ సాగర్ చెరువు కట్టపై, అకారణంగా రోడ్లపై సంచరిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు.
పండుగల నేపథ్యంలో
పట్టణంలోని పలు కాలనీల నుంచి అర్ధరాత్రి పోలీసులకు డయల్ 100 ద్వారా ఫిర్యాదులు అధిక మొత్తంలో అందుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు పోలీసులు అలాంటి వారిని పట్టుకుని వారి వద్ద నుంచి ఫింగర్ ప్రింట్, వారి వ్యక్తిగత వివరాలు తీసుకొని, వారి తల్లిదండ్రుల ముందు కౌన్సిలింగ్ చేస్తున్నారు. కొందరిని మైనర్లుగా భావించి వదిలేస్తున్నారు. ఇకపై పబ్లిక్ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించే యువకుల ఆగడాలకు చెక్ పెట్టడం కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. రానున్న పండుగల నేపథ్యంలో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం పరిధిలో ఉన్న పాత నేరస్తులపై కూడా తనిఖీలో భాగంగా వారిపై ప్రత్యేక బృందం నిఘా పెట్టింది.
ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలే
జిల్లా హెడ్ క్వార్టర్స్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లవేళలా పనిచేస్తూనే ఉంటుంది. అర్ధరాత్రి 12 తర్వాత అనవసరంగా ఎవరైనా పట్టణంలో గాని, రోడ్లపై గాని తిరిగితే కఠిన చర్యలు తప్పవు. మహిళలపై గాని, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. శాంతి భద్రతల దృష్ట్యా పెట్రోలింగ్తో పాటు సిబ్బందితో గస్తీ చేడుతున్నాం.
రమేష్, సంగారెడ్డి పట్టణ సీఐ