
నిజాయితీకి నిదర్శనం ఆర్టీసీ ఉద్యోగులు
● బస్సులో ప్రయాణికుడు మరిచిపోయిన నగలు, నగదు అప్పగింత ● ఉద్యోగులను సన్మానించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
గజ్వేల్రూరల్: గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లోగల జీపీపీ(గజ్వేల్–ప్రజ్ఞాపూర్) ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహించే ఉద్యోగులు నిజాయితీకి నిదర్శనంగా నిలిచారు. వీరి నిజాయితీని గుర్తించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం హైదరాబాద్లోని బస్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగులను సన్మానించారు. జీపీపీ ఆర్టీసీ డిపోకు చెందిన (టీజీ 36 జెడ్ 0027)బస్సులో గజ్వేల్ నుంచి భువనగిరి మార్గంలో కండక్టర్ ఓం ప్రకాష్, డ్రైవర్ సలీంలు ఈ నెల 2న విధులు నిర్వహించారు. ప్రయాణికుడు యాదగిరి భువనగిరిలో బస్సు ఎక్కి జగదేవ్పూర్కు టికెట్ తీసుకున్నాడు. రాత్రి ప్యాసింజర్లు కూర్చునే సీటుపై ఉన్న లగేజ్ పార్శిల్ రాక్లో ఓ బ్యాగ్ ఉండటాన్ని కండక్టర్ ఓం ప్రకాష్ గుర్తించాడు. వెంటనే ప్రయాణికులను అడిగి వారి సమక్షంలో ఆ బ్యాగును తెరిచి చూడగా 15తులాల బంగారు నగలు, రూ.మూడున్నర లక్షల నగదును గుర్తించారు. వెంటనే ఆ బ్యాగును జగదేవ్పూర్ పోలీసులకు అప్పగించారు. బ్యాగు మరిచిపోయిన ప్రయాణికుడు యాదగిరి అక్కడే ఉండటంతో ఎస్ఐ ఆధ్వర్యంలో టికెట్ ఆధారంగా బ్యాగును అప్పగించారు. కాగా నిజాయితీని చాటుకున్న జీపీపీ ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్తో పాటు డిపో మేనేజర్ పవన్లను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించి సన్మానించారు.