
తాగడానికి డబ్బులివ్వలేదని భర్త ఆత్మహత్య
వెల్దుర్తి(తూప్రాన్): మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వెల్దుర్తి మండలం శేరీల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఇక్కిరి స్వరూప, యాదగిరి(41)లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. యాదగిరి కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. గత నెల 31న మద్యం తాగడానికి భార్యను డబ్బులు అడుగగా తన వద్ద లేవని పంట డబ్బులు వచ్చిన తరువాత ఇస్తానని చెప్పింది. దీంతో అదేరోజు ఇంటి నుంచి బయటకు వెళ్లి పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా గురువారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మనస్తాపంతో ఉరేసుకొని మహిళ..
సంగారెడ్డి : మనస్తాపంతో ఉరేసుకొని మహిళ మృతి చెందిన ఘటన చౌటకూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పుల్కల్ ఎస్ఐ క్రాంతికుమార్ పాటిల్ వివరాల ప్రకారం... అందోల్ మండలం సంగుపేట గ్రామానికి చెందిన కావేరి (23 )ను చౌటకూరు గ్రామానికి చెందిన పోచయ్యతో గత సంవత్సరం క్రితం వివాహం జరిపించారు. భర్తతో పాటు అత్తమామలతో కలిసి ఉంటున్నారు. వివాహం అనంతరం మూడు నెలలకే గర్భస్రావం అయింది. అలాగే 15 రోజుల క్రితం మరలా గర్భం దాల్చగా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి గర్భంలో ఉన్న శిశువుకు హృదయ స్పందన సరిగా లేదని, శిశువును తీసివేయాలని చెప్పారు. భర్త అత్తామామలు ఈ విషయంపై, అలాగే వరకట్నంపై ప్రతిసారి సూటిపోటి మాటలు మాట్లాడేవారరని భావించిన కావేరి బుధవారం ఉదయం ఇంట్లోనే ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను భర్త పోచయ్య సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి చనిపోయిందని తెలిపారు. ఈ విషయంపై మృతురాలి తల్లి భూమమ్మ ఫిర్యాదు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తల్లి మందలించడంతో యువకుడు..
హవేళిఘణాపూర్(మెదక్): చెడు అలవాట్లకు బానిసైన ఓ యువకుడిని ప్రవర్తన మార్చుకోవాలని తల్లి మందలించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. సర్దన గ్రామానికి చెందిన ఎండి.సల్మాన్(24) జీవనోపాధి కోసం వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం సాయంత్రం పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన సల్మాన్ను తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.