
అనూ ఫర్నిచర్ గోదాంలో అగ్నిప్రమాదం
పటాన్చెరు టౌన్: తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాటి గ్రామ శివారులో ఉన్న అను ఫర్నిచర్ గోదాంలో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో పనిచేసేవారు భోజనానికి వెళ్లిన సమయంలో పాత వస్తువులు ఉండే చోట మంటలు చెలరేగి భవనంలో ఉన్న కొత్త ఫర్నిచర్కు మంటలు దావానంలా వ్యాపించాయి. అయితే మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పటాన్చెరు, జీడిమెట్ల, కూకట్పల్లి పాశమైలారం ప్రాంతాల నుంచి ఐదు అగ్నిమాపక శాఖ అధికారులు ఫైర్ ఇంజిన్లను తీసుకొచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలకు ఫర్నిచర్ ఉన్న భవనం బీటలు బారి కూలిపోయే స్థితికి చేరుకుంది. ఎవరూ భవన సమీపానికి వెళ్లకుండా డీఎస్పీ ప్రభాకర్, సీఐ స్వామి గౌడ్ పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మరో పక్క మాదాపూర్ నుంచి మంటలను ఆర్పే రోబో వచ్చినప్పటికీ లోపలికి వెళ్లేందుకు వీలు లేక బయటే ఉండి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించింది. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులు బ్రాంటో స్కై లిఫ్ట్ అగ్నిమాపక వాహనాన్ని తెప్పించి చివరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ... మధ్యాహ్నం సమయం కావడంతో పని చేసే కార్మికులు భోజనానికి వెళ్లడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. అయితే షెడ్లో వెల్డింగ్ చేస్తుండగా మంటలు అంటుకుని ప్రమాదం జరిగిందని అగ్ని మాపక శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం సంభవించిందని అను ఫర్నిచర్ సంస్థ హెచ్ఆర్ జోషి తెలిపారు. సంఘటనా స్థలాన్ని హైడ్రా రీజనల్ అగ్నిమాపక అధికారి జయప్రకాష్ ,స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, బీడీఎల్ సీఐ స్వామి గౌడ్ పర్యవేక్షించారు.
అదుపులోకి వచ్చిన మంటలు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన
డీఎస్పీ ప్రభాకర్