
బాల్య వివాహం.. ముగ్గురిపై కేసు నమోదు
బాలికను బాలల సంరక్షణ కేంద్రానికి తరలింపు
శివ్వంపేట(నర్సాపూర్): బాలికకు పెళ్లి చేసినందుకు ఆమె తల్లిదండ్రులతోపాటు పెళ్లి కుమారుడిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మధుకర్రెడ్డి, ఐసీడీఎస్ అధికారుల కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి బాలికను వేసవి సెలవుల నేపథ్యంలో కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ములుగు మండలానికి చెందిన వ్యక్తితో గుట్టుచప్పుడు కాకుండా తల్లిదండ్రులు పెళ్లి చేశారు. కాగా విషయం తెలియడంతో ఐసీపీఎస్ కో ఆర్డినేటర్ శంకర్గౌడ్, మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ సంతోష, పంచాయతీ కార్యదర్శి గాయత్రీ గ్రామంలో విచారణ చేశారు. బాల్య వివాహం చేయడం సరికాదని తల్లిదండ్రులకు చెప్పి బాలికను మెదక్ బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుకర్రెడ్డి తెలిపారు.