చెరువు కట్టలు భద్రమేనా? | - | Sakshi
Sakshi News home page

చెరువు కట్టలు భద్రమేనా?

Jun 4 2025 8:49 AM | Updated on Jun 4 2025 4:38 PM

చెరువు కట్టలు భద్రమేనా?

చెరువు కట్టలు భద్రమేనా?

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : వర్షాకాలంలో చెరువులు, కుంటల నిర్వహణపై నీటిపారుదల శాఖ దృష్టి సారించింది. భారీ వర్షాలతో వరద నీరు వచ్చి కట్టలు తెగిపోవడం, బుంగలు పడటం, కాలువలు ధ్వంసం కావడం వంటి జరిగే అవకాశాలుండటంతో ఆ శాఖ అప్రమత్తమైంది. గతేడాది వర్షాకాలంలో 75 శాతానికి మించి నిండిన చెరువులు, అలుగులు పారిన చెరువుల పరిస్థితిపై ఆరా తీస్తోంది. ఈ చెరువుల కట్టలు ఎక్కడైనా బలహీనంగా ఉన్నాయా? తూములు మరమ్మతులు అవసరం ఉంటాయా? అలుగుల పరిస్థితి ఎలా ఉంది? 75 శాతానికి మించి నీళ్లు చేరితే కట్టలు తెగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. ఆయా మండలాల ఏఈఈలు, డీప్యూటీఈఈలు ఈ చెరువులను వెంటనే పరిశీలించాలని ఆదేశాలు వెళ్లాయి. ఎక్కడైనా బుంగలు పడితే తక్షణం మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

75%కు మించి నిండిన చెరువులు 748

నీటిపారుదలశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 1,769 చెరువులున్నాయి. ఇందులో 100 ఎకరాల లోపు ఆయకట్టు ఉన్న చిన్న చెరువులతోపాటు, వంద ఎకరాలకు మించి ఆయకట్టున్న చెరువులు కూడా ఉన్నాయి. గతేడాది వర్షాలు విస్తారంగా కురవడంతో సెప్టెంబర్‌లోనే సుమారు 748 చెరువులు నిండాయి. ఇందులో 218 చెరువులు అలుగు పారగా, 75 శాతానికి మించి నిండిన చెరువులు 530 వరకు ఉంటాయి. ఇలా 75% నిండిన చెరువుల్లోకి ఈ వర్షాకాలంలో కూడా వరదనీరు వచ్చి చేరే అవకాశాలుండటంతో ఈ చెరువులపై ఈ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడైనా చెరువుల కట్టలు ధ్వంసమైతే తక్షణం మరమ్మతులు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆ శాఖ ఆదేశించింది. అలాగే అలుగులు, తూములను మరమ్మతులు చేయాలని సూచించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై నీటిపారుదలశాఖ అధికారులతో కలెక్టర్‌ వల్లూరు క్రాంతి ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.

వర్షాకాలం నేపథ్యంలో నీటిపారుదలశాఖ అప్రమత్తం

మరమ్మతులు చేపట్టాలి

క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు

నదీ పరీవాహక ప్రాంతాల్లో..

జిల్లాలో నదీ పరీవాహక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడైనా ముంపునకు గురైతే ఆ ప్రాంతాల్లో ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ప్రధానంగా మంజీర, నక్కవాగు వంటివి ఉన్నప్పటికీ..ఈ పరీవాహక ప్రాంతాల్లో ముంపు ముప్పు పెద్దగా ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement