
6 నుంచి బడి బాట
19 వరకు నిర్వహణ
● బడుల్లో ప్రవేశాల పెంపే లక్ష్యం
నారాయణఖేడ్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ప్రభుత్వ పాఠ శాలల్లో బడీడు పిల్లలను బడిలో చేర్పించడం కోసం ఈనెల 6 నుంచి ‘బడి బాట’కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతీ ఏడాది నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే రోజువారీ నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలను పాఠశాల విద్య డైరెక్టర్ విడుదల చేశారు. గతానికి భిన్నంగా ఇప్పటికే ఉపాధ్యాయులకు మూడు విడతలుగా ఐదురోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సర్కారు పాఠశాలలను బలోపేతం చేసేందకు పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు, నిష్ణాతులైన ఉపాధ్యాయులు, సౌకర్యాలు తదితర అంశాలను తల్లిదండ్రులకు వివరిస్తూ వారి పిల్లలు సర్కారు బడుల్లో చేర్పించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
పిల్లలకు, తల్లిదండ్రులకు స్వాగత కార్యక్రమాలు
ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సందర్భంగా ఆ రోజున పాఠశాలలను ప్రత్యేకంగా అలంకరించి పండగ వాతావరణంలో తల్లిదండ్రులు, ప్రజలకు స్వాగతం పలకాలని ఉపాధ్యాయులు యోచిస్తున్నారు. అదేరోజు ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేస్తూ పేరెంట్స్ టీచర్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించాలని అధికారులు సూచించారు.
టీఎస్ యూటీఎఫ్ ప్రచార జాత..
‘బడిబాట’కు ముందే టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంలో భాగంగా జిల్లాలో ఇప్పటికే ఐదు రోజులపాటు ప్రచార జాత నిర్వహించారు. సంఘం నాయకులు ప్రత్యేక వాహనాలతో గ్రామాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలని, పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాల గూర్చి వివరిస్తూ చైతన్యవంతులను చేశారు. జిల్లాలో ‘బడిబాట’ను పూర్తిస్థాయిలో విజయవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
కార్యక్రమాలు ఇలా..
6వ తేదీన ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులతో గ్రామసభ 7న ఉపాధ్యాయులు ఇంటింటి సందర్శనతోపాటు బడీడు పిల్లలను గుర్తించడం, 8,9,10తేదీల్లో కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేపట్టనున్నారు. అదేరోజు అంగన్వాడీ కేంద్రాల సందర్శన, బడి మానేసిన పిల్లలను గుర్తించి చేర్పించడం, ప్రత్యేకావసరాల పిల్లలను అందుబాటులోని భవిత కేంద్రాల్లో ప్రవేశాలు కల్పించడం చేస్తారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమాలపై 11న సమీక్ష, 12న అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించడం, పిల్లలకు పాఠ్య, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేయనున్నారు. 19న బడిబాట ముగింపు సందర్భంగా పిల్లలకు క్విజ్ పోటీలు నిర్వహిస్తారు.