
ఆదర్శ పాఠశాలగా రుద్రారం
పటాన్చెరు టౌన్: రాష్ట్రంలోనే రుద్రారం గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను రూ.16 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఎంవైకే లాటిక్రేట్ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్మాణ ప్లాన్, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మాట్లాడుతూ...రుద్రారం గ్రామ పరిధి నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్, అంగన్వాడీ పాఠశాల భవనాలను ఆధునిక సాంకేతికతతో నిర్మించనున్నామన్నారు. ఎంవైకే లాటిక్రేట్ పరిశ్రమ సహకారంతో రూ.16 కోట్ల అంచనా వ్యయంతో ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ కృతిక ద్వారా మౌలిక వసతులను కల్పించనున్నట్లు తెలిపారు. ఫుట్బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ కోర్టులను నిర్మించబోతున్నట్లు వివరించారు. త్వరితగతిన పాఠశాల నిర్మాణం పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకుని వస్తామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పాండు, మాజీ ఎంపీటీసీలు రాజు, హరి ప్రసాద్రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ నాయక్, సంస్థ ప్రతినిధి రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
రూ.16 కోట్ల వ్యయంతో
నూతన భవనం..మౌలిక వసతులు
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి