
కుటుంబ కలహాలతో మహిళ బలవన్మరణం
సంగారెడ్డి క్రైమ్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరేసుకొని మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్ కథనం మేరకు.. పట్టణంలోని మంజీరా నగర్కు చెందిన పోతన వెంకట నాగలక్ష్మి, మనోహర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు గాయత్రీ (27)కి అదే పట్టణానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో 2017లో వివా హం జరుగగా గొడవలు వచ్చి 2021లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక పాప ఉంది. తర్వాత గాయత్రీకి బోడుప్పల్ (హైద్రాబాద్) ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తితో రెండో వివా హం జరిగింది. గాయత్రీ భర్తతో కలిసి సంగారెడ్డిలోనే తల్లి నాగలక్ష్మి ఇంట్లో ఉంటుంది. గాయత్రీ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి నెల కిందట పట్టణంలోని బైపాస్ ప్రాంతంలో గల లలిత ఆస్పత్రి పక్కన హోటల్ బిజినెస్ ప్రారంభించింది. తల్లి హార్ట్ పేషెంట్ కావడంతో ఆమె ఆరోగ్య విషయంలో 27న రాత్రి తల్లీకూతురు మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గాయత్రీ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యానికి బానిసై ఉరేసుకొని వ్యక్తి
కొమురవెల్లి(సిద్దిపేట): మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బుధవారం ఎస్ఐ రాజు కథనం మేరకు.. చేర్యాల మండలంలోని కడవేర్గు గ్రామానికి చెందిన కొయ్యడ వెంకటేశ్(45) భార్య పద్మతో కలిసి కొంతకాలంగా కొమురవెల్లి గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఏడాది కాలంగా మద్యానికి బానిసై డబ్బుల కోసం భార్యను వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి భార్యతో గొడవపడి గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. ఉదయం వరకు తలుపులు తీయకపోవడంతో ఇరుగు పొరుగు వారి సాయంతో బద్దలు కొట్టి చూడగా ఉరేసుకొని కనిపించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చెరువులో దూకి యువకుడు
గజ్వేల్రూరల్: చెరువులో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని సింగాటంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన అందోల్ నర్సయ్య–అంజమ్మకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు కృష్ణ(26) ఉన్నారు. కృష్ణ కొద్ది రోజులుగా తూప్రాన్ పరిఽధిలోని ఓ విత్తన పరిశ్రమలో పని చేస్తున్నాడు. 26న సింగాటం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కలిసి ఆటోలో బయలుదేరిన కృష్ణ మార్గమధ్యలో పిడిచెడ్లో దిగాడు. సదరు వ్యక్తి సింగాటం రావా అని కృష్ణను అడుగగా తర్వాత వస్తానంటూ బదులిచ్చి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని సదరు వ్యక్తి కృష్ణ కుటుంబ సభ్యులకు చెప్పాడు. అతడి కోసం కుటుంబ సభ్యులు తెలిసిన చోట వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. బుధవారం గ్రామంలోని లింగం చెరువులో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించిన గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. చెరువు కట్ట వద్ద బూట్లు, బ్యాగ్తోపాటు సెల్ఫోన్ ఉండగా మృతదేహాన్ని బయటకు తీసి కృష్ణగా గుర్తించారు. కృష్ణ పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉండటంతో కేసులకు భయపడి, మనోవేదనకు గురై చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.