
వర్షాకాలం.. జీవాలు భద్రం
● గొర్రెలకు చిటుకు వ్యాధి సోకే ప్రమాదం ● చికిత్స కన్న నివారణ మేలు ● రైతులకు సూచనలు చేసిన పశువైద్య అధికారులు
దుబ్బాకటౌన్: తొలకరి చినుకులు జిల్లాను పలకరించాయి. తొలకరిలో గొర్రెల పెంపకం దారులు తరుచూ నష్టాలకు గురవుతుంటారు. తొలకరి చినుకులకు మొలిసిన గడ్డిని ఎక్కువగా జీవాలు తినడం వల్ల చిటుకు వ్యాధి వస్తుంది. దీనినే నెత్తిపిడుగు, గడ్డి రోగం, పాటు రోగం అని కూడా అంటారు. ఈ వ్యాధి నివారణకు గొర్రెల పెంపకం దారులు తగు జాగ్రత్తలు పాటించాలని దుబ్బాక పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలసుందరం కొన్ని సూచనలు చేశారు. బలిష్టంగా పెరిగిన గొర్రెలు వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేత కోసం వలస వెళ్లే గొర్రెల్లో ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది. క్లాస్ట్రీడియం ఫర్ ఫ్రింజర్స్ టైప్–డీ రకం సూక్ష్మజీవులు జీవాల ప్రేగుల్లో గాలి లేని వాతావరణంలో అభివృద్ధి చెందుతాయి. ఇవి వదిలిన విషపదార్థాలు చిటుకు వ్యాధికి కారణమవుతాయి. తొలకరి చినుకులకు పెరిగిన గడ్డిని గొర్రెలు అధికంగా తింటాయి. దీని వల్ల వాటి ప్రేగుల్లో గాలి లేని వాతావరణం ఏర్పడి సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది వ్యాధిని కలుగజేస్తాయి. ఈ వ్యాధి తొలకరి చినుకులు పడినప్పటి నుంచి జూలై నెలాఖరు వరకు ఎక్కువగా వస్తుంది.
నివారణ ముఖ్యం
చికిత్స కంటే వ్యాధి నివారణే ముఖ్యం. ఏటా ఏప్రిల్, మే నెలల మధ్యలో వ్యాధి నిరోధక టీకా (మల్టీ కాంపోనెంట్ ఈటీ వ్యాక్సిన్) మందలో ఉన్న జీవాలన్నింటికి తప్పకుండా వేయించాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో పశువైద్యాధికారికి తెలియజేసి చికిత్స, జాగ్రత్తలు పాటించాలి. తొలకరి వర్షాలకు మొలిచి వాడిపోయిన గడ్డిని మేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం సమయంలో జీవాలను మేపకూడదు. వ్యాధి సోకిన జీవాలను మంద నుంచి వేరు చేయాలి. జాగ్రత్తలు పాటిస్తే చిటుకు వ్యాధి బారి నుంచి జీవాలను కాపాడుకోవచ్చు.
వ్యాధి లక్షణాలు...
ఈ వ్యాధి సోకిన గొర్రెలు సాధారణంగా ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే అకస్మాత్తుగా మరణిస్తాయి. చనిపోయే ముందు చాలా నీరసంగా ఉంటాయి. ఎగిరి కిందపడి కాళ్లు కింద కొట్టుకుంటూ, పళ్లు కొరుకుతూ..బిగుసుకుని కొన్ని క్షణాల్లో చనిపోతాయి. వ్యాధి సోకిన మరికొన్ని గొర్రెలు చొంగ కారుస్తుంటాయి. శ్వాస అధికంగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించి మందకు చికిత్స చేయించాలి.

వర్షాకాలం.. జీవాలు భద్రం