
ఉచిత పాలీసెట్ శిక్షణ
సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలీసెట్ దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు ప్రిన్సిపాల్ జానకి దేవి ఒక ప్రకటనలో తెలిపారు. పాలీసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న పదవ తరగతి ఉత్తీర్ణత అయిన విద్యార్థులకు ఈనెల 5 నుంచి శిక్షణ ప్రారంభించనున్నారు. ఈ నెల 13వ తేదీన పరీక్ష ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గిరిజన యువకుడికి డాక్టరేట్
పుల్కల్(అందోల్): మండల పరిధిలోని లాల్ సింగ్ నాయక్ తండాకు చెందిన ర మావత్ ప్రకాశ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా సాధించాడు. క్రీడల విభాగంలో ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ పర్యవేక్షణలో మేల్ ఖోఖో ప్లేయర్స్ మోటార్ ఫ్లయింగ్ ఎబిలిటీ తదితర అంశాలపై పరిశోధన చేసి పుస్తకాన్ని రాశాడు. నిరుపేద కుటుంబం నుంచి క్రీడల విభాగంలో నూతన ఆవిష్కరణ చేసిన ప్రకాశ్ను గ్రామస్తులు అభినందించారు.
ఉపాధ్యాయ సమస్యలను మండలిలో ప్రస్తావిస్తా
ఎమ్మెల్సీ అంజిరెడ్డి
జహీరాబాద్ టౌన్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. శుక్రవారం జహీరాబాద్లో ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ డీఏ, పీఆర్సీలు పెండింగ్లో ఉన్నాయని, ఈ బిల్లుల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ విషయమై శాసనమండలిలో మాట్లాడుతానని చెప్పారు. విద్యా, వైద్యం కీలకమైన శాఖలని, వీటికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కోరారు. దేశహితం కోసం జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, తపస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు హన్మంత్రావు, సురేష్, జహీరాబాద్ నాయకులు మల్లయ్యస్వామి, తుక్కప్ప, మొగులయ్య, మల్లయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు.
హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి
జహీరాబాద్ టౌన్: నియోజకవర్గంలోని పలు పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతులు పొందారు. హద్నూర్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మాణిక్, ఝరాసంగంకు చెందిన సుభాష్, జహీరాబాద్ టౌన్ పీఎస్లో పనిచేస్తున్న రాథోడ్ మోతిరాం. చిరాగ్పల్లికి చెందిన బాలకృష్ణలు హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి లభించింది. డీఎస్పీ రామ్మోహన్రెడ్డి శుక్రవారం పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదోన్నతి వల్ల విధుల పట్ల బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ టౌన్ సీఐ శివలింగం, ఎస్ఐలు పాల్గొన్నారు.
పిల్లలపై శ్రద్ధ వహించాలి
● జిల్లా న్యాయ సేవధికారి
సంస్థ కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి టౌన్: పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య సూచించారు. సంగారెడ్డిలోని శిశు గృహ, సఖి, భరోసా కేంద్రాలను శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారి బాగోగులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. చట్టాలపై అవగాహన కలిగించాలని, పిల్లలకు సరైన వసతులను అందించాలని చెప్పారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు న్యాయపరమైన విషయంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.

ఉచిత పాలీసెట్ శిక్షణ