
దార్శనికుడు బసవేశ్వరుడు
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి : బహుజన వర్గాలను రాజ్యాధికారానికి చేరువ చేసిన దార్శనికుడు బసవేశ్వరుడని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. బసవ జయంతిని పురస్కరించుకుని బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బైపాస్లోని బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ...కుల మతాలకతీతంగా మహిళలందరికీ సమానత్వం కావాలని కోరుకున్న మహనీయుడు బసవేశ్వరుడు అని అన్నారు. కష్టంలోనే సుఖం స్వర్గం ఉందని చెప్పిన మహనీయుడని ఆయన చూపిన మార్గం భావితరాలకు ఆదర్శనీయమని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నాయకులు శివరాజ్ పాటిల్, జిల్లా అధికారి జగదీశ్వర్, రామప్ప, చీల మల్లన్న తదితరులు పాల్గొన్నారు.
బసవేశ్వరుడి బోధనలు
ఆదర్శనీయం: గూడెం
రామచంద్రాపురం(పటాన్చెరు): విశ్వగురు మహాత్మ బసవేశ్వరుడి బోధనలు నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. రామచంద్రాపురం పట్టణంలో బసవేశ్వరుడి జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. రామచంద్రాపురం బీరంగూడ కమాన్ వద్ద బసవేశ్వరుని విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ బసవేశ్వరుని బోధనలు ప్రతీ ఒక్కరికి అందించాలన్న లక్ష్యంతో బీరంగూడ కమాన్ వద్ద సొంత నిధులు రూ.30 లక్షలతో బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆయన అనుసరించిన మార్గాన్ని భావితరాలు ఆచరించాలని సూచించారు. అనంతరం కార్పొరేటర్ పుష్ప, నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్టినేటర్ వి.ఆదర్శ్రెడ్డి బసవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
నెలలోనే పింఛను పత్రాలు
ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అగర్వాల్
పటాన్చెరు టౌన్: పదవీ విరమణ పొందిన నెలలోనే పింఛను ప్రయోజనాలను మంజూరు చేసే ప్రక్రియను క్రమబద్ధీకరించి నెలలోనే వారికి సంబంధించిన పత్రాలు (పీపీఓ) అందేలా చర్యలు తీసుకున్నట్లు ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కమిషనర్ విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో పదవీ విరమణ పొందిన 56మంది చందాదారులకు పీపీఓలను జారీ చేసి అందులో 26 మందికి కార్యాలయంలో బుధవారం అందజేశారు. అనంతరం లబ్ధిదారులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్–2 ప్రశాంత్ ప్రియదర్శి, అకౌంట్ ఆఫీసర్ అబ్దుల్ అజీమ్ పాల్గొన్నారు.
సీఐటీయూ పోరాట ఫలితమే
సంగారెడ్డి : సీఐటీయూ పోరాట ఫలితమే అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు అని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు మే నెలంతా సెలవులు ఇస్తున్నామని ప్రభుత్వం తెలియజేయడం సంతోషకరమన్నారు. ఇతర సేవలు అందించటం కోసం అంగన్వాడీ ఉద్యోగులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీలకు వేసవి సెలవుల నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వానికి సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సమరశీల పోరాటాలకు అంగన్వాడీ సిబ్బంది సిద్ధం కావాలని కోరారు.

దార్శనికుడు బసవేశ్వరుడు