
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడదాం
ఎమ్మెల్యే సునీతారెడ్డి
హత్నూర (సంగారెడ్డి): కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక పాలనను ఎక్కడికక్కడ ఎండగడతామని ఎమ్మెల్యే సునీతారెడ్డి స్పష్టం చేశారు. హత్నూర మండలం దౌల్తాబాద్ తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం సునీతారెడ్డి పూలమాలలు వేసి వరంగల్ సభకు వెళ్లే వారికి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఎన్నికల సమయంలో ఆ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చడం లేదన్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తామని స్పష్టం చేశారు. వరంగల్ రజతోత్సవ సభ ప్రభుత్వానికి చెంప పెట్టన్నారు. గ్రామాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా సభకు ప్రజలు తరలిరావడం ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. రైతులను విస్మరించిన ప్రభుత్వం ఎన్నడూ ముందుకు సాగదని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్రెడ్డి. పీఏసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, పలు గ్రామాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.