
భార్యతో గొడవపడి భర్త బలవన్మరణం
జిన్నారం (పటాన్చెరు): మద్యం సేవించి భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన బొల్లా రం పోలీస్ స్టేషన్ పరిధిలోని జీఎంఆర్ కాలనీలో చోటు చేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి కథనం మేరకు.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దండుగుల కురుమయ్య (39) కుటుంబం బతుకు దెరువు కోసం వచ్చి ఖాజీపల్లి జీఎంఆర్ కాలనీలో స్థిరపడ్డారు. ఆదివారం కురుమయ్య మద్యం సేవించి ఇంటికొచ్చాడు. భార్య ఎల్లమ్మతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. క్షణికావేశంలో గ్రామ శివారులోని అడవి మైసమ్మ గుడి సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అతడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పుల బాధతో వ్యక్తి..
రామాయంపేట(మెదక్): పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సోమవారం మండలంలోని అక్కన్నపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హవేళీఘనపూర్ మండలం ముద్దుల్వాయి గ్రామానికి చెందిన తంత్రి సిద్ధరాములు (55) ఓ కోళ్ల ఫారమ్లో పని చేస్తున్నాడు. అప్పుల బాధతో ఫారమ్లోనే రసాయనిక మందు తాగి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో పురుగు మందు తాగి
పాపన్నపేట(మెదక్): ఆర్థిక ఇబ్బందులతో పురుగు మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన రావుగారి ఆంజనేయులు (38) హైదరాబాద్లో మేసీ్త్ర పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో కొంతకాలంగా ఇబ్బందుల పాలవుతున్నాడు. గ్రామంలోని బంధువుల ఇంట్లో 19న జరిగిన విందుకు హాజరయ్యాడు. క్రిమి సంహారక మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి వెళ్లాడు. చికిత్స నిమిత్తం మెదక్ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో..
వెల్దుర్తి(తూప్రాన్) : ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు.ఈ ఘటన మండలంలోని మానెపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చౌదరిపేట రాగిరి(50) పొలం వద్ద ఇటీవల బోరు వేయగా ఫెయిల్ అయ్యింది. వ్యవసాయానికి కొంత అప్పు చేశాడు. పంట సైతం ఎండిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. అప్పులు ఎలా తీర్చాలోనని మదనపడుతూ 17న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

భార్యతో గొడవపడి భర్త బలవన్మరణం

భార్యతో గొడవపడి భర్త బలవన్మరణం