పింఛన్‌ ఇక సులభతరం | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ ఇక సులభతరం

Apr 22 2025 7:04 AM | Updated on Apr 22 2025 7:04 AM

పింఛన్‌ ఇక సులభతరం

పింఛన్‌ ఇక సులభతరం

సంగారెడ్డి జోన్‌: రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం ద్వారా వివిధ కేటగిరిలలో పింఛన్‌ పంపిణీ చేస్తుంది. ఈ సందర్భంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు సెర్ప్‌ ఆధ్వర్యంలో ముఖ గుర్తింపు హాజరు పెన్షన్‌ మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తుంది. దీంతో పింఛన్లు పారదర్శకంగా పంపిణీతో పాటు వృద్ధులకు ఇబ్బందులు తొలగనున్నాయి.

జిల్లాలో 1,55,837 పింఛన్‌దారులు

జిల్లాలో వివిధ కేటగిరిలలో 1,55,837 మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. దివ్యాంగులు, వృద్ధాప్య, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడి, కల్లుగీత కార్మికులు, డయాలసిస్‌తో పాటు తదితరులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా వితంతువులు, వృద్ధులు ఉన్నారు. దివ్యాంగులకు రూ.4016, ఇతరులకు రూ.2016లను అందిస్తున్నారు. ప్రతి నెలా రూ.36,15,19,230లు పింఛన్‌ డబ్బులు తీసుకుంటున్నారు.

బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చెల్లింపులు

ప్రస్తుతం చేయూత ద్వారా అందించే పింఛన్‌ డబ్బులు బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా చెల్లిస్తున్నారు. నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే డ్రా చేసుకునే సమయంలో వృద్ధులు పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వేలిముద్రలు రాకపోవటంతో సకాలంలో డబ్బులు అందక అవస్థలు పడుతున్నారు. వేలిముద్రలు రాని వారికి సంబంధిత పంచాయతీ కార్యదర్శి డబ్బులు డ్రా చేసి అందిస్తున్నారు. అధికారులు అందుబాటులో లేని సమయంలో పింఛన్‌ డబ్బుల కొరకు తిరుగుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొటున్న సందర్భాలు ఉన్నాయి.

ముఖ గుర్తింపు హాజరు అమలుకు కసరత్తు

మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అన్ని రంగాల్లో అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు సులభతరంగా పెన్షన్‌ అందించేందుకు ఫేస్‌ రికగ్నిషన్‌ ద్వారా పంపిణీ చేసేందుకు సెర్ప్‌ ఆధ్వర్యంలో కసరత్తు చేస్తుంది. ప్రత్యేక యాప్‌ ద్వారా పెన్షన్‌ దారుడి ముఖాన్ని నిర్ధారణ చేసి పంపిణీ చేయనుంది. మరో రెండు, మూడు నెలల్లో ఈ విధానం అమలులోకి రానుంది.

ముఖ గుర్తింపు హాజరు అమలుకు కసరత్తు

వృద్ధులకు తొలగనున్న ఇబ్బందులు

త్వరలో అమలు కానున్న విధానం

అక్రమాలకు తావు లేకుండా..

నూతన విధానం అమలుతో వృద్ధులకు వేలిముద్రల సమస్యతో పాటు అక్రమాలకు తావు లేకుండా పంపిణీ చేయనుంది. బ్యాంకులలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయటం ద్వారా వివిధ మార్గాల ద్వారా తీసుకుంటున్నారు. పింఛన్‌దారుడు మృతి చెందిన సమయంలో సమాచారం అందించకపోవటంతో నెలల తరబడి ఖాతాల్లో జమ అయ్యి వారి కుటుంబ సభ్యులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.

జిల్లాలో పింఛన్‌ల వివరాలు

దివ్యాంగులు 14,465

వృద్ధులు 59,083

వితంతువులు 70,673

చేనేత కార్మికులు 683

కల్లుగీత కార్మికులు 813

ఒంటరి మహిళలు 7,475

బీడి కార్మికులు 112

ఇతరులు 2,533

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement