
దుబాయిలో చిక్కుకున్న వ్యక్తికి ఆపన్నహస్తం
హుస్నాబాద్: తాను దుబాయిలో చిక్కుకున్నానని రక్షించాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన చొప్పరి లింగయ్య అనే గల్ఫ్ కార్మికుడు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ను వేడుకుంటూ ఇటీవల ఓ సెల్ఫీ వీడియో పంపించాడు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఎం. వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన దుబాయిలోని సామాజిక సేవకులు సుతారి సత్యం పటేల్ను సంప్రదించి లింగయ్యకు అవసరమైన సహాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దౌత్య ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి.
విద్యుత్ వైర్లు తగిలి
పశుగ్రాసం దగ్ధం
శివ్వంపేట(నర్సాపూర్): ప్రమాదభరితంగా కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగలడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదివారం పోతులబోగూడ నుంచి ఉసిరికపల్లి వైపునకు గడ్డి లోడ్తో (పశుగ్రాసం) వస్తున్న ట్రాక్టర్కు పాంబండ వద్ద 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి. గుర్తించిన ట్రాక్టర్ డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి గడ్డి లోడ్కు కట్టిన తాడు తొలగించి ట్రాలీని లేపి గడ్డిని కిందపడేశాడు. దీంతో వెల్దుర్తి– ఉసిరికపల్లి ప్రధాన రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న నర్సాపూర్ అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో మంటలను ఆర్పివేసి రాకపోకలను పునరుద్ధరించారు. నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల రోడ్డు ఎత్తు పెరిగి విద్యుత్ వైర్లు పలు చోట్ల కిందికి ప్రమాదభరితంగా వేలాడుతుండటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపించారు.