TS: ఒకే కుటుంబంలో 9 మందికి జీవితఖైదు | - | Sakshi
Sakshi News home page

సంగారెడ్డి: ఒకే కుటుంబంలో 9 మందికి జీవితఖైదు

Dec 30 2023 5:46 AM | Updated on Dec 30 2023 10:42 AM

- - Sakshi

పాపం నర్సమ్మ బాల్య వివాహాన్ని అడ్డుకుందని ఏకంగా ఆమెపై దాడి చేసి.. 

జహీరాబాద్‌ టౌన్‌: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం కాశీంపూర్‌లో జరిగిన ఓ మహిళా హత్య కేసులో 9 మందికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి ఐదు వేల జరిమాన విధిస్తూ జిల్లా అదనపు సెషన్స్‌ జడ్జి గన్నారపు సుదర్శన్‌ శుక్రవారం తీర్పు ఇచ్చారు. చిరాగ్‌పల్లి ఎస్‌ఐ నరేష్‌ కథనం ప్రకారం.. కాశీంపూర్‌కు చెందిన వడ్ల నర్సమ్మ తన కొడుకుతో కలిసి జహీరాబాద్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. ఆమె బంధువులైన వడ్ల వీరన్న కూతురి పెళ్లి కుదిరింది. బాల్య వివాహం చేస్తున్నారన్న ఫిర్యాదుతో అధికారులు వెళ్లి ఆ పెళ్లిని ఆపించారు. జహీరాబాద్‌లో ఉంటున్న నర్సమ్మ ఉద్దేశ పూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేయించి తన కూతురి పెళ్లిని ఆపించిందని వీరన్న కక్ష పెంచుకున్నాడు.

పింఛన్‌ డబ్బు కోసమని 2016 మార్చి 25న ఆమె జహీరాబాద్‌ నుంచి కాశీంపూర్‌కు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న అతడు ఇదే అదనుగా భావించి బంధువులైన వడ్ల ప్రభు(40), వడ్ల ప్రశాంత్‌(19), వడ్ల వెంకట్‌(19), వడ్ల సంతోష్‌(19), వడ్ల రేఖ(28), వడ్ల ప్రభావతి(40), వడ్ల ఈశ్వరమ్మ(42), వడ్ల శ్రీకాంత్‌(17)తో కలిసి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమె జహీరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

నర్సమ్మ కుమారుడు వడ్ల పాండు ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ సదానాగరాజు, చిరాగ్‌పల్లి ఎస్‌ఐ రాజశేఖర్‌ కేసును దర్యాప్తు చేసి కోర్టుకు సమర్పించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. నిందితులకు పై శిక్ష విధించింది. జరిమాన చెల్లించడంలో విఫలమైతే ఒక సంవత్సరం సాధారణ శిక్షతో పాటు రూ. 500 జరిమాన చెల్లించాలని న్యాయమూర్తి సుదర్శన్‌ తీర్పు ఇచ్చారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన చిరాగ్‌పల్లి, జహీరాబాద్‌ పోలీసులను ఎస్పీ చెన్నూరి రూపేష్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement