
రూ.50వేల నుంచి లక్ష ధరలో రోబో లభించాలి
రోబోల పనితీరుపై రైతులకు నమ్మకం కలిగించాలి
ఐసీఏఆర్– ‘అటారి’ డైరెక్టర్ డా. మీరా
కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న రోజులివి. వ్యవసాయ రంగం కూడా ఇప్పుడు ఈ డిజిటల్ మార్పులను స్వీకరిస్తోంది. కానీ, మన దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో రోబోలను విలాసవంతమైన ఆవిష్కరణగా మాత్రమే చూస్తున్నారు. ఈ దశలో తెలంగాణ రాష్ట్రం డిజిటల్ వ్యవసాయ విప్లవం దిశగా అడుగులు వేస్తోంది.
ఈ కృషిలో తెలంగాణ సహా తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా ఎలా మారగలవన్న అంశంపై డిజిటల్ వ్యవసాయంలో ప్రపంచ స్థాయి పరిజ్ఞానం ఉన్న సీనియర్ శాస్త్రవేత్త, హైదరాబాద్లోని అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఏటీఏఆర్ఐ– అటారి) సంచాలకులు డాక్టర్ షేక్ ఎన్.మీరాతో ‘సాక్షి’ ముచ్చటించింది. రోబోటిక్స్, డిజిటల్ వ్యవసాయ సాంకేతికతపై స్పష్టమైన ప్రణాళికతో, సమగ్రమైన విధానంతో ముందడుగు వేస్తే రైతులకు మేలు జరుగుతుందని మీరా అంటున్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
వ్యవసాయ రోబోటిక్స్పై ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పోటెత్తుతున్నాయి.. ఎందుకని?
వ్యవసాయ రంగంలోని ప్రధాన సమస్యలకు రోబోలు సమాధానంగా నిలుస్తున్నాయి. ఇవి కూలీల కొరతను పరిష్కరిస్తాయి. ఎరువులు, నీరు, పురుగుమందుల వంటి ఉత్పాదకాల వినియోగాన్ని తగ్గిస్తాయి. ఉత్పాదకతను పెంచుతాయి. అనేక దేశాల్లో ఇందుకు ఉదాహరణలు కనిపిస్తాయి:
ఎకో రోబోటిక్స్ (స్విట్జర్లాండ్): గడ్డిపై కాకుండా ఇతర కలుపు మొక్కలపై మాత్రమే కలుపు మందులను పిచికారీ చేస్తూ 90% వరకు రసాయనాల వినియోగాన్ని ఈ రోబోలు తగ్గిస్తున్నాయి.
అగ్రోబోట్ (స్పెయిన్): స్ట్రాబెర్రీలను సున్నితంగా, నాణ్యత పాడవకుండా కోసే సామర్థ్యం ఈ రోబోలకు ఉంది.
ఇలాంటి రోబోలు ఖరీదైన ‘టాయ్స్’ కాదు. భారతీయ చిన్న రైతులకు సరిపోయేలా, సరసమైన వ్యయంతో మనమూ తయారు చేయవచ్చు.
⇒ తెలంగాణ కోసం మీరు గతంలో సూచించిన ఐదు అంచెలవ్యూహం ఏమిటి?
⇒ తెలంగాణకు ఉన్న ఉరిమే ఉత్సాహం క్షేత్రస్థాయిలో ఆచరణలోకి రావాలంటే ఈ ఐదు అంచెల వ్యూహాన్ని అనుసరించాలి:
ఒక పనికి ఒక రోబో: ఉదాహరణకు.. మల్టీ టాస్కింగ్ రోబోలు కాకుండా, పసుపును ఉడకబెట్టే ఆవిరి యంత్రం, కలుపు తీసే యంత్రం, వరుసలుగా విత్తనాలు వేసే యంత్రం లాంటి చిన్న రోబోలను అభివృద్ధి చేయాలి.
స్థానిక ఆవిష్కరణ – ప్రపంచ ప్రేరణ: ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్లు, అగ్రి–స్టార్టప్లను ప్రోత్సహించి పత్తి తీయటం, మిరప కాయలు కోయటం, వరి నాట్లు వేయటం వంటి పనులు చేసే చిన్న రోబోలను స్థానికంగానే రూపొందించాలి.
పైలట్ గ్రామాల్లో రోబోటిక్ జోన్లు: స్మార్ట్ అగ్రికల్చర్ మిషన్ కింద 20 గ్రామాలను ఎంచుకొని పైలట్ ప్రాజెక్టులను అమలు చేయాలి. ఈ గ్రామాల్లో ఫలితాలను బట్టి రాష్ట్రం అంతటా అమలు చెయ్యాలి.
అద్దెకు రోబోలు: రోబోలను ట్రాక్టర్ల మాదిరిగా అద్దెకు ఇచ్చే విధంగా కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చెయ్యాలి. రోబోలను రైతులు మొబైల్ ఫోన్ ద్వారా బుక్ చేసుకునే సౌలభ్యం ఉండాలి.
గ్రామీణ రోబోటిక్ వనరుల కేంద్రాలు: గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి.. రోబోల మరమ్మతులకు సంబంధించిన నైపుణ్యాలు నేర్పించే శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
ఇతర దేశాల్లో చిన్న రైతులకు రోబోల ద్వారా అందిస్తున్న అనుభవాల నుంచి మనం నేర్చుకోవాల్సినవేమిటి?
ప్రభుత్వాలు పరిశోధనలకు విధానాలు, పెట్టుబడుల ద్వారా అండగా నిలవాలి. సబ్సిడీలు అందించి, శిక్షణ సదుపాయాల ద్వారా అవసరమైన ఆధునిక నైపుణ్యాలను అందించాలి.
ఇజ్రాయెల్: ప్రతి నీటి చుక్కను, పోషకాలను వృథా కాకుండా సూటిగా లక్ష్యానికి చేరేలా రోబో ఆధారిత ఎరువుల సరఫరా వ్యవస్థను ఇజ్రాయెల్ అమలు చేస్తోంది. మహబూబ్నగర్ వంటి కరువు ప్రాంతాలకు ఇది ఎంతో ఉపయోగకరం.
ఆస్ట్రేలియా: భారీ కమతాల్లో తమంతట తామే కలుపు తీసే అటానమస్ వీడర్లను ఆస్ట్రేలియాలో గతంలోనే అభివృద్ధి చేసింది.
జపాన్, దక్షిణ కొరియా: వృద్ధ రైతులకు తోడ్పాటునందించే వరి నాట్లేసే రోబో యంత్రాల ఉత్పత్తిపై జపాన్, దక్షిణ కొరియా దేశాలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. రైతులు ఈ రోబోలను అద్దెకు తీసుకొని నాట్లు వేసుకుంటున్నారు.
చైనా: రోబోలను చైనా ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు ఇస్తోంది. గ్రామీణ యువతకు ‘రోబో ఆపరేటర్లు’గా శిక్షణ ఇస్తోంది.
తెలంగాణ ఉద్యాన తోటల సాగు రంగానికి రోబోలు ఎలా తోడ్పడగలవు?
రాష్ట్రంలో భారీగా మామిడి, అరటి వంటి పండ్ల తోటలు, మిరప, పసుపు, కూరగాయల తోటలు సాగవుతున్నాయి. అరటి గెలలు కోసే రోబోలు, మామిడి కాయలను గ్రేడింగ్ చేసే రోబోలను అందుబాటులోకి తెస్తే నాణ్యత పెరిగి మంచి ధర వస్తుంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పాలీహౌస్ రైతులకు రోబోలను అందిస్తే తక్కువ ఖర్చుతోనే పనులు చకచకా, తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకోగలుగుతారు.
కానీ, ప్రతిబంధకాలు కూడా ఉన్నాయి కదా?
అవును. ప్రధానంగా రోబోల ధరలు. రోబో ధర రూ. 8–10 లక్షలు ఉంటే రైతులకు అందుబాటులో ఉండదు. రూ. 50 వేల నుంచి లక్ష పరిధిలో దొరికేలా మార్గాలు చూడాలి.
⇒ స్థానికంగా మరమ్మతులు చేసే వ్యవస్థ ఉండాలి.
⇒ రోబోలు వస్తే ఇక తమకు ఏమీ పని ఉండదని రైతులు భావిస్తున్నారు. అవి మనుషులకు ప్రత్యామ్నాయం కాజాలవని, రైతు కూలీలకు సహాయంగా ఉండే సాధనాలు మాత్రమేనని చెప్పి, వారిలో నమ్మకం కల్పించాలి. క్షేత్ర ప్రయోగాల్లో రోబోలు వాడి చూపించి రైతుల్లో రోబోల ప్రయోజకత్వంపై నమ్మకం కలిగించాలి.
రోబోలతో తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయంపై ప్రభావం ఎంత ఉండొచ్చు?
పురుగుమందులు, ఎరువుల వాడకం 30–40% తగ్గిపోతుంది. పనులు ఒత్తిడి ఉండే కాలంలో కూలీల శ్రమ 20–25% వరకు తగ్గుతుంది. విత్తనాలు వేయటం, నాట్లు వేయటం, పంటల కోతలో సామర్థ్యం 50% పెరుగుతుంది. రోబోలను నడపటం, మరమ్మతు చేయటం, డిజైన్లపై పనిచేయటం ద్వారా గ్రామీణ యువతకు కొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
విశేష అనుభవం
సీనియర్ వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్తగా అపారమైన క్షేత్రస్థాయి అనుభవంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన అనుభవం డాక్టర్ షేక్ ఎన్.మీరాకు ఉంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఐఫాడ్)లో సీనియర్ డిజిటల్ అగ్రికల్చర్ నిపుణుడిగా ఈజిప్టు రాజధాని కైరో నగరం కేంద్రంగా గతంలో అనేక సంవత్సరాలు పనిచేశారు.
‘అటారి’ అంటే
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్–ఐకార్), పరిశోధనా సంస్థలు కాలానుగుణంగా చేసే పరిశోధనల ఫలితాలను సాధారణ రైతులకు చేర్చేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకేలు) వ్యవస్థ ఏర్పాటైంది. ప్రతి జిల్లాలో కనీసం ఒక కేవీకే ఉంటుంది.
స్థానిక వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా రైతులకు మార్గనిర్దేశనం చేయటంలో కేవీకేలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కేవీకేల వ్యవస్థపై పర్యవేక్షణకు జోన్ల వారీగా 11 అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఏటీఏఆర్ఐ– అటారి)లు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కేవీకేలు హైదరాబాద్ అటారి అజమాయిషీలో పనిచేస్తుంటాయి.