మంచాల: ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన ఓ యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచాల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెనమోని భాస్కర్(30) వృత్తి రీత్యా ఎలక్ట్రీషన్. ఇటీవల ఆయన తల్లి చనిపోవడంతో ఇంట్లో ఒక్కడే ఉంటున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలు దాటినా ఆయన బయటకు రాలేదు. దీంతో చుట్టుపక్కల వారు గమనించి ఊర్లో ఉన్న అతడి అన్న బాలరాజు, అక్క లక్ష్మికి విషయం చెప్పారు. వారు వెంటనే వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా చీరతో ఉరి వేసుకొని వేళాడుతూ విగతజీవిగా భాస్కర్ కనిపించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు సైతం ఫిర్యాదులో పేర్కొన్నారు.
రోడ్డుకు మరమ్మతులు
మొయినాబాద్: మున్సిపల్ 9వ వార్డు జీవన్గూడలో అధ్వానంగా మారిన రోడ్డుకు కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ మరమ్మతులు చేయించారు. జీవన్గూడలో రెండు నెలల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు. పైపులు వేసేందుకు గాను కాలనీలో రోడ్డును తవ్వారు. కానీ పనులు పూర్తయిన తరువాత మట్టితో గుంతలు పూడ్చి చదును చేయకుండా అలాగే వదిలేశారు. కాగా నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి మట్టి కొట్టుకుపోయి రోడ్డు గుంతలమయంగా మారడంతో గ్రామస్తుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆదివారం 9వ వార్డు కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ దగ్గరుండి మొరం పోయించి గుంతలు పూడ్చివేయించారు.


