
వృథాగా ఉందని పాగా..
స్థానికం
కేశంపేట: వృథాగా ఉన్న నక్షబాట కబ్జాకు కొందరు రియల్టర్లు యత్నించారు. కుట్రలో భాగంగా జేసీబీ సహాయంతో దానిని ధ్వంసం చేయగా.. గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం వేముల్నర్వ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కేశంపేట మండలం వేముల్నర్వ నుంచి షాద్నగర్– కేశంపేటకు రాకపోకలు సాగించేందుకు గ్రామశివారులోని 285, 284, 274 సర్వే నంబర్లలో నక్షబాట ఉండేది. ఈ మార్గంగుండా దేవరకొండ, జడ్చర్లకు సర్వీసులు నడిచేవి.
పొలాల మీదుగా ఉందని..
ప్రత్యామ్నాయంగా గతంలో షాద్నగర్– కేశంపేటకు మరో మార్గాన్ని.. సర్వే నంబర్ 232లోని ప్రభుత్వ భూమిని దాటిన తరువాత సర్వే నంబర్ 285 మీదుగా కాకుండా 233, 238, 239 సర్వే నంబర్ల మీదుగా రోడ్డును నిర్మించారు. నాటి నుంచి వాహనాలు ఈ రహదారి మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో వేముల్నర్వ సమీపంలోని 274, 275, 276 సర్వే నంబర్లలో స్థిరాస్తి వ్యాపారులు కొదరు భూములను కొనుగోలు చేశారు. అయితే వారు కొనుగోలు చేసిన పొలాల మీదుగా ఉన్న బాట వృథాగా ఉందని, దానిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు.
రికార్డులు పరిశీలించి..
నక్షబాట కబ్జా విషయంపై కొందరు గ్రామస్తులు.. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రికార్డులను పరిశీలించి, నక్షాబాట ఉందని తేల్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ బాటను ధ్వంసం చేయవద్దని చెప్పారు. బాటతో పాటు పక్కనే నాయినోని చెరువు ఉందని స్పష్టం చేశారు. అనంతరం రియల్టర్లు మాట్లాడుతూ.. వెంచర్ ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ అనుమతులు తీసుకున్నామని, సంబంధిత పత్రాలను తహసీల్ కార్యాలయంలో అందజేస్తామని అధికారులకు తెలిపారు.
ప్రవాహానికి అడ్డుగా మట్టి
వెంచర్ ఏర్పాటు చేస్తున్న భూములు మీదుగా వాగు ప్రవాహం వచ్చేందుకు గతంలో కల్వర్టును నిర్మించారని ప్రాంత రైతులు తెలిపారు. కానీ రియల్టర్లు వాగునీటి ప్రవాహానికి అడ్డుగా మట్టిని పోస్తున్నారని చెప్పారు. ఇదేమిటని ప్రశ్నించగా.. వాగు నీరు వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తామని రియల్టర్లు సమాధానం చెప్పారని బాధితులు పేర్కొన్నారు. అలా జరిగితే తమ పొలాలు సాగుకు పని రాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు చెప్పారు.
నక్షబాట కబ్జాకు యత్నం
జేసీబీ సహాయంతో ధ్వంసం
అడ్డుకున్న గ్రామస్తులు..
ఘటనా స్థలాన్ని పరిశీలించినరెవెన్యూ అధికారులు