
ఎఫ్సీడీఏలో లేనట్లేనా?
సీఎం దృష్టికి తీసుకెళ్తా
మా గ్రామాన్ని చేర్చలేదు
యాచారం: మండల పరిధిలోని తమ నాలుగు గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్సీడీఏ) పరిధిలో కలపాలంటూ చేస్తున్న ప్రజల అభ్యర్థనలు కార్యరూపం దాల్చడం లేదు. ఎఫ్సీడీఏలోకి వచ్చే 56 రెవెన్యూ గ్రామాల మ్యాప్ను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వారం రోజుల క్రితం సీఎం రేవంత్రెడ్డి మీర్ఖాన్పేట సమీపంలో అథారిటీ భవనానికి భూమి పూజ నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లాలోని ఏడు మండలాలు, 56 రెవెన్యూ గ్రామాలు, 765 చదరపు కిలోమీటర్ల పరిధిని ఎఫ్సీడీఏలోకి తీసుకుని ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ఫోర్త్ సిటీని నిర్మించాలని రేవంత్రెడ్డి సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది. ఎఫ్సీడీఏ పరిధిలోకి తీసుకునే ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కందుకూరు, ఆమనగల్లు, కడ్తాల్, మహేశ్వరం మండలాల్లో అత్యధికంగా యాచారం మండలంలోనే 17 రెవెన్యూ గ్రామాలను తీసుకున్నారు. యాచారంలో మొత్తం 21 రెవెన్యూ గ్రామాలు ఉండగా, కేవలం నాలుగింటిని వదిలేశారు. ఎఫ్సీడీఏ ఏర్పాటైన మార్చి నెలలోనే యాచారం మండల పరిధిలోని మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి, సూల్తాన్పూర్ ప్రజలు తమ గ్రామాలను సైతం అథారిటీలో కలపాలని ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది.
యాచారం పక్కనే మొండిగౌరెల్లి..
యాచారం మండల కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మొండిగౌరెల్లిని వదిలేసి, ఆతర్వాత వచ్చే చింతపట్ల, నల్లవెల్లిని ఎఫ్సీడీఏలో కలిపారు. నల్లవెల్లిని అనుకుని ఉన్న మంతన్గౌరెల్లి, మంతన్గౌడ్, సూల్తాన్పూర్ను వదిలేశారు. మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లిలో పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి, కానీ మంతన్గౌడ్, సూల్తాన్పూర్లు వ్యవసాయ భూముల రికార్డుల పరంగా రెవెన్యూ గ్రామాలైనప్పటికీ ప్రత్యేక జీపీలు లేవు.
ఫలితం శూన్యం
మండలంలోని మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి, మంతన్గౌడ్, సూల్తాన్పూర్ను కూడా ఎఫ్సీడీఏలోకి తీసుకోవాలని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి నుంచి మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు అందజేసినా ఫలితం కనిపించడం లేదు. నేతలు, అధికారులు సానుకూలంగా హామీ ఇచ్చినప్పటికీ అమలులో కార్యరూపం దాల్చడం లేదు. తాజాగా సర్కార్ ఎఫ్సీడీఏ అధికారిక మ్యాప్ను ప్రకటించడంతో మళ్లీ వీరిలో ఆందోళన నెలకొంది. తమ నాలుగు రెవెన్యూ గ్రామాలను అటు నల్గొండ జిల్లా మర్రిగూడ మండల పరిధిలో కలుపుతారా.. లేక యాచారం మండలం పక్కనే ఉన్న మంచాల మండలంలో కలుపుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ నాలుగు గ్రామాలపై ఎటూ తేల్చని వైనం
ప్రజల అభ్యర్థనలపై స్పష్టత ఇవ్వని నేతలు, అధికారులు
ఎఫ్సీడీఏ మ్యాప్ విడుదలతో మరింత ఆందోళన
మొండిగౌరెల్లి, మంతన్గౌరెల్లి ప్రజలు తమ గ్రామాలను ఎఫ్సీడీఏలోకి కలపాలని కోరుతున్నారు. ఈ విషయమై గతంలో ఉన్నతాధికారులకు లేఖ రాశా. నేరుగా సీఎం రేవంత్రెడ్డిని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా.
– మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం
యాచారానికి కూత వేటు దూరంలో ఉన్న మొండిగౌరెల్లిని ఎఫ్సీడీఏలో కలెక్టర్, ఎమ్మెల్యేను కలిసి విన్నవించాం. ఇందుకు వారు సానుకూలంగా స్పందించినప్పటికీ స్పష్టత రాలేదు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్లో కూడా మా గ్రామాన్ని చేర్చలేదు. – తాండ్ర రవీందర్, మొండిగౌరెల్లి

ఎఫ్సీడీఏలో లేనట్లేనా?

ఎఫ్సీడీఏలో లేనట్లేనా?