
ఎన్నికల పోటీకి ఎవరు అర్హులు?
● నామినేషన్ పరిశీలన నాటికి
21 సంవత్సరాలుండాలి
● కందుకూరు ఎంపీడీఓ సరిత
కందుకూరు: స్తానిక సంస్థల(ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు, వార్డు సభ్యులు) ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులకు ఎదురయ్యే సందేహాలపై మంగళవారం ఎంపీడీఓ సరిత సమాధానాలతో నివృత్తి చేశారు.
ప్రశ్న: స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు ఎంత?
జ: నామినేషన్ పరిశీలన తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
ప్రశ్న: సంబంధిత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పరిధిలోని ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు కాకపోయినా పోటీ చేయవచ్చా?
జ: లేదు. తెలంగాణ పంచాయతీ రాజ్ నియమావళి ప్రకారం సంబంధిత ఓటరు లిస్టులో తప్పనిసరిగా ఓటరుగా నమోదై ఉండాలి.
ప్రశ్న: అభ్యర్థులకు ఇద్దరు పిల్లల నిబంధన తొలగించారా?
జ: పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే అనర్హులే. 1995 మే 31 ముందు ఇద్దరి కంటె ఎక్కువ మంది సంతానం ఉంటే అర్హులు. 1995 జూన్ 1 తర్వాత పుట్టిన వారితో కలిపి ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నప్పుడు అనర్హులవుతారు.
ప్రశ్న: ముగ్గురు సంతానం ఉన్నప్పుడు ఒకరిని దత్తత ఇస్తే పోటీ చేయొచ్చా?
జ: ఉమ్మడి రాష్ట్రంలోని హైకోర్టు తీర్పు ప్రకారం దత్తత ఇచ్చిన పిల్లలు స్వంత తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగానే పరిగణించబడతారు. ముగ్గురు సంతానం ఉండి ఒకరిని దత్తత ఇచ్చినా వారు పోటీకి అనర్హులే. వారికి ముగ్గురు సంతానం ఉన్నట్లే పరిగణించబడతారు.
ప్రశ్న: ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండి వారికి ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున ఉన్నప్పుడు ఏవిధంగా పరిగణిస్తారు?
జ: అప్పుడు భార్యలు పోటీకి అర్హులు అవుతారు, భర్తకు అవకాశం ఉండదు.
ప్రశ్న: పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 1995 మే 31 కంటె ముందు ఇద్దరు పిల్లలు ఉండి, పోటీ చేసిన తర్వాత మరొకరు పుడితే ఎలా?
జ: నామినేషన్ల పరిశీలన పూర్తయ్యే సమయానికి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉండి, పోటీ చేసే వ్యక్తి భార్యగాని, పోటీ చేసే మహిళనే మళ్లీ గర్భవతిగా ఉన్నా పోటీకి అర్హులే అవుతారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత బిడ్డకు జన్మనిచ్చినా పోటీకి అర్హులే అవుతారు.

ఎన్నికల పోటీకి ఎవరు అర్హులు?