
పిటిషన్ వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన
● సీఎం ఆస్తుల విలువ పెంచుకొనేందుకే ఆ రోడ్లు
● అందుకే గ్రీన్ఫీల్డ్ రోడ్డు, ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్పు
● రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది
● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అవన్నీ తప్పుడు ‘మార్గాలు’
కడ్తాల్: సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబం, బంధువుల ఆస్తుల విలువ పెంచుకోవడానికే గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు చేయడంతో పాటు ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చడం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కడ్తాల్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల మీదుగా ఏర్పాటు చేస్తున్న 765 హైటెన్షన్ విద్యుత్లైన్ అలైన్మెంట్కు వ్యతిరేకంగా బాధిత రైతులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం 21వ రోజుకు చేరుకున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగర్జన సభకు వెళ్తున్న కేటీఆర్ దీక్ష శిబిరం వద్దకు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఉద్దేశపూర్వకంగా సొంత భూముల విలువ పెంచుకోవడానికి ఎవరికీ అవసరం లేని గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. రోడ్డు నిర్మాణం కోసం 1,200 ఎకరాల పట్టా భూములను రైతుల నుంచి సేకరిస్తుండంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. సొంత ఆస్తుల విలువను పెంచుకోవడంతో పాటు అనుయాయులకు దోచిపెట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని, రైతులకు అండగా ఉంటామన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో పేదల కడుపుకొట్టకుండా, వారికి నష్టం కలుగకుండా అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు. హైటెన్షన్ విద్యుత్లైన్ బాధిత రైతులు కలిసి వస్తే న్యాయస్థానంలో వారి పక్షాన పోరాడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్గుప్తా, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రజనీ సాయిచంద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్నాయక్, సర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.