
స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తాం
● మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
● జిల్లా ముఖ్య నేతల సమావేశం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కనిపించడం లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి అన్నారు. ఒకవేళ నిర్వహిస్తే జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలన్నీ బీఆర్ఎస్ కై వసం చేసుకోవడం ఖాయమని చెప్పారు. ఈ మేరకు ఆదివారం శంషాబాద్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో 22 నెలలుగా నాటకాలాడుతున్న రేవంత్ ప్రభుత్వం మొదట్లోనే ఎందుకు జీఓ జారీ చేయలేదని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చాక అమలు చేయడం లేదని అన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించితే రాజ్యాంగబద్ధంగా చర్యలు చేపట్టాల్సింది పోయి జీఓ జారీ చేయడం కాలయాపన కోసమేనని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీ తీర్మానం, గవర్నర్ ఆమోదం, కేంద్ర ఆమోదం కోసం ఢిల్లీలో ధర్నా తదితర డ్రామాలతో కాలయాపన చేసిన రేవంత్ చివరికి మోసపూరిత జీవో జారీచేసి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. వాస్తవా లను గమనించలేనంత అమాయకులు ప్రజలు కారని, మోసకారి కాంగ్రెస్కు కర్రకాల్చి వాత పెట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏ రిజర్వేషన్లు వచ్చినా పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణేలకు పిలుపునిచ్చారు. సమావేశంలో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, సీనియర్ నాయకుడు క్యామ మల్లేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చిలకమర్రి నర్సింహ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు పట్నం అవినాష్ రెడ్డి, బూర్కుంట సతీష్, రమేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు నర్సింగ్ రావు, నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు దేశమోల్ల ఆంజనేయులు, కార్మిక నాయకుడు పి.నారాయణ పాల్గొన్నారు.