
రేపు ఉద్యోగ మేళా
తుక్కుగూడ: జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశం కల్పించడానికి ఈ నెల 29న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి జయశ్రీ ఒక ప్రటకనలో పేర్కొన్నారు. నగరంలోని ఫాక్స్కాన్ కంపెనీలో పోస్టులు ఉన్నట్టు చెప్పారు. డిప్లొమా ఎలక్ట్రానిక్స్, మెకానిక్ ఇంజనీరింగ్ విద్యార్హత కలిగి ఉండాలన్నారు. 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు అర్హులని తెలిపారు. వివరాలకు ఉపాధి కార్యాలయం, శాంతినగర్, ఐటీఐ క్యాంపస్, మల్లేపల్లి, హైదరాబాద్లో లేదా 90630 99306, 89771 75394 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
నందిగామ: ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంపై అవగాహన పెంపొందించడంతో పాటు ధ్యానాన్ని ప్రోత్సహించేందుకు 56 ఏళ్ల వ్యక్తి ఉత్తర్ప్రదేశ్ నోయిడా నుంచి 14 రోజుల పాటు 1,700 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టి శనివారం కన్హా శాంతి వనానికి చేరుకున్నాడు. దేశ యువతను వ్యసనాల నుంచి దూరంగా ఉంచి, ధ్యానాన్ని ఆహ్వానించాల ని పిలుపునిస్తూ నోయిడాకు చెందిన తరుణ్ సర్కార్ ఈ నెల 13న సైకిల్ యాత్ర ప్రారంభించాడు. మధుర, ఆగ్రా, గ్వాలియర్, వివపురి, గునా, బియావారా, భోపాల్, ఇటార్సి, బేతూల్, నాగ్పూర్, నిర్మల్, కామారెడ్డి మీదుగా కన్హాకు చేరుకున్నట్లు చెప్పారు. హార్ట్ఫుల్ నెస్ గురూజీ కమ్లేష్ పటేల్ జన్మదినం సందర్భంగా ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రమైన కన్హా ఆశ్రమానికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తరుణ్ సర్కార్ను కమ్లేష్ పటేల్ అభినందించారు.
యాచారం: కందుకూరు–మీరాఖాన్పేట గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో పది మంది గాయాలపాలు కావడంతో వారి స్వగ్రామం కుర్మిద్దలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన వారితో పాటు క్షతగాత్రులంతా నిత్యం రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కూలీలు. గ్రామం నుంచి నిత్యం రావిరాల సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేయడానికి వెళ్తుంటారు. రోజు మాధిరిగా విధులు ముగించుకుని ఆటోలో వస్తున్న క్రమంలో రోడ్డుపై నిలిపి ఉన్న సిమెంట్ మిక్సర్ మిల్లర్ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న సురిగిరి శ్రీనివాస్ (39), పంది శ్రీధర్ (26), పంది సత్తమ్మ (49) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో పదిమంది గాయపడ్డారు. మృతదేహలకు ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించి శనివారం రాత్రి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అందరూ ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనర్గా 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పని చేస్తున్న సీవీ ఆనంద్ను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది ఐపీఎస్ అధికారుల బదిలీల నేపథ్యంలో.. హైదరాబాద్ కమిషనరేట్లో కీలక మార్పుచేర్పులు చోటు చేసుకున్నాయి. అదనపు సీపీగా (శాంతిభద్రతలు) పని చేస్తున్న విక్రమ్సింగ్ మాన్ను అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా నియమించింది. ఈ స్థానంలో తఫ్సీర్ ఇక్బాల్ను సంయుక్త సీపీ హోదాలో నియమించింది. ప్రస్తుతం సీఐడీలో ఐజీ హోదాలో ఉన్న ఎం.శ్రీనివాసులుకు అదనపు సీపీ (నేరాలు, సిట్)గా పోస్టింగ్ ఇచ్చింది. ఇక్కడ పని చేస్తున్న పి.విశ్వప్రసాద్ ఇటీవల తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సభ్యులుగా నియమితులైన విషయం విదితమే. వెస్ట్జోన్ డీసీపీగా పని చేస్తున్న ఎస్ఎం విజయ్కుమార్ సిద్ధిపేట పోలీసు కమిషనర్గా వెళ్తున్నారు. ఆ స్థానంలోకి రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ బదిలీ అయ్యారు. సిద్ధిపేట సీపీ డాక్టర్ బి.అనురాధ ఎల్బీనగర్ జోన్ డీసీపీగా వస్తున్నారు. నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ రాజేంద్రనగర్ డీసీపీగా బదిలీ అయ్యా రు. ఏసీబీలో పని చేస్తున్న రితిరాజ్ను మాదా పూర్ డీసీపీగా ప్రభుత్వం నియమించింది.

రేపు ఉద్యోగ మేళా