
అగ్రిమెంట్లు!
లావణి, అసైన్డ్ భూములపై అధికార పార్టీ నేతల కన్ను
● మంఖాల్ కేంద్రంగా మరో భూ దందా ● నిషేధిత జాబితాలోని భూమికి గుట్టుగా అగ్రిమెంట్లు ● రియల్టర్లకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు
నిషేధిత
భూముల
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నాలా కన్వర్షన్, నిషేధిత జాబితాలో ఉన్న లావణి పట్టా భూమిపై ఎలాంటి అగ్రిమెంట్లు చెల్లవు. కానీ ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్న ఓ రియల్టర్ ఏకంగా 33:67 రేషియోలో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కం జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు, రెవెన్యూ అధికారుల సహకారంతో డెవలపర్లు రెచ్చిపోతున్నారు. రైతులను మభ్యపెట్టి విలువైన భూములను అగ్గువకే కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం ప్రతిషాత్మకంగా భావించిన ఫోర్త్సిటీకి ఆనుకుని ఉన్న మహేశ్వరం మండలం మంఖాల్ కేంద్రంగా ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికే పలు భూములను చెరబట్టిన రియల్టర్లు తాజాగా ఇదే రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 632/1/7లో మరో 1.05 ఎకరాల లావణి పట్టాకు గుట్టుగా అగ్రిమెంటు చేసుకోవడం గమనార్హం.
క్రయవిక్రయాలు నిషేధం
మిగులు భూముల చట్టం రాకతో భూస్వాముల నుంచి పెద్ద మొత్తంలో భూములు ప్రభుత్వం చేతికి అందాయి. ఈ మిగులు భూములను అప్పటి ప్రభుత్వాలు స్థానికంగా ఉన్న పేదలు సాగు చేసుకుంటూ జీవించేందుకు పంచాయి. రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఈ భూములను అమ్మడం, కొనడం నిషిద్ధం. కానీ జిల్లాలో భూముల ధరలు ఆకాశాన్నంటడం, తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తంలో సంపాదించే అవకాశం ఉండటంతో కొంత మంది రియల్టర్లు ఈ భూములపై కన్నేశారు. పేద రైతులకు డబ్బులను ఆశచూపి, తక్కువ ధరలకే ఆయా భూములను చేజిక్కించుకుంటున్నారు. ఈ భూములు రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో 99 ఏళ్ల లీజు ప్రతి పాదికన అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఆ తర్వాత తమకున్న పరిచయాలు, ఆర్థిక బలంతో పైరవీల ద్వారా సీలింగ్ భూములను పట్టా భూములుగా మార్చేస్తున్నారు. జిల్లాలో ఇలా ఇప్పటికే మెజార్టీ భూమలు అన్యాక్రాంతమైనట్లు సమాచారం.
ఫోర్త్సిటీ రాకతో మరిన్ని అక్రమాలు
మీర్ఖాన్పేట్ కేంద్రంగా 30 వేల ఎకరాల్లో ప్రభుత్వం ఫోర్త్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు సైతం చేపట్టింది. ఈ ఫోర్త్సిటీకి ఇరువైపులా విస్తరించిన ఉన్న మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్, ఇబ్రహీంపట్నం, మాడ్గుల, యాచారం, మంచాల మండలాల్లోని పట్టా భూములతో పాటు అసైన్డ్ భూములపై రియల్టర్ల కన్నుపడింది. ఇప్పటికే ఆయా భూములు భారీగా చేతులు మారాయి. అసైన్డ్, భూదాన్, లావణి భూముల పక్కనే ఉన్న కొద్దిపాటి పట్టా భూములను కొనుగోలు చేసి, అసైన్డ్, లావణి భూములను కలిపేస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలతో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి పట్టా భూములుగా మార్చేస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సహా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి ఫోర్టల్ నిషేధిత జాబితాలో ఆయా సర్వే నంబర్లు కన్పిస్తున్నా.. క్షేత్రస్థాయిలో భూముల పొజిషన్ మాత్రం కన్పించడం లేదు.