
ఇందిరమ్మ మాకొద్దు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అనువైన నివాస స్థలం ఉండి.. గూడులేని నిరుపేదలకు సొంతిల్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాకు 28 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు నాలుగు విడతల్లో రూ.5 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు ప్రకటించింది. ముందస్తు ఖర్చులకు లబ్ధిదారుల వద్ద డబ్బులు లేకపోవడంతో ముగ్గు పోసేందుకే జంకుతున్నారు. ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందుల మధ్య ఇళ్లు కట్టుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. తమకు కేటాయించిన ఇళ్లను రద్దు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా లేఖలు అందిస్తుండడం విశేషం. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సాక్షి బృందం నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక అంశాలు వెలుగు చూశాయి.
మండలాల్లో ఇలా..
● శంకర్పల్లి మండలంలో 450 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 236 మంది నిర్మాణ పనులు చేపట్టారు. 186 మంది ఇతర కారణాలతో తమకు ఇళ్లు వద్దని అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. మరో 28 మంది ఎటూ తేల్చుకోలేక పోతున్నారు.
● ఇబ్రహీంపట్నం మండలంలో 436 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 268 మంది నిర్మాణం మొదలు పెట్టారు. 36 ఇళ్లు బేస్మెంట్ వరకు పూర్తయ్యాయి. మరో 57 నిర్మాణానికి నిరాకరించారు.
● కందుకూరు మండలంలో 1,222 మందికి ఇళ్లు మంజూరు కాగా, 540 మంది నిర్మాణ పనులు చేపట్టగా, 129 ఇళ్లు మాత్రమే బేస్మెంట్ వరకు పూర్తయ్యాయి.
● షాబాద్ మండలంలో 700 మందికి ఇళ్లు మంజూరు కాగా, 439 మంది నిర్మాణలు ప్రారంభించారు. 113 ఇళ్లు బేస్మెంట్ లెవల్కు చేరుకు న్నాయి. 113 మంది నిరాకరించారు.
● మహేశ్వరం మండలంలో 1,054 ఇళ్లు మంజూరు కాగా, 598 మంది నిర్మాణ పనులు మొదలు పెట్టగా, 295 మంది నిరాకరించారు. 124 ఇళ్లు బేస్మెంట్ లెవల్కు చేరుకోగా, 25 ఇళ్లకు మాత్రమే రూ.లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమైంది.
● కడ్తాల్ మండలంలో 349 ఇళ్లు మంజూరు కాగా, 271 మంది మాత్రమే పనులు మొదలు పెట్టారు. మరో 78 మంది ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు.
● మొయినాబాద్ మండలంలో 500 ఇళ్లు మంజూరు కాగా, 276 ఇళ్లకు పనులు ప్రారంభమయ్యాయి. 224 మంది నిరాకరించారు.
● మంచాల మండలంలో 437 మందికి ఇళ్లు మంజూరు కాగా, వీరిలో ఇప్పటి వరకు 350 మాత్రమే వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలిన వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
● యాచారం మండలంలో 440 ఇళ్లు మంజూరు కాగా, 316 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. 50 మంది ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. మరో 74 మంది నిరాకరించారు.
● కేశంపేట మండలంలో 745 మందికి ఇళ్లు మంజూరు కాగా, వీరిలో 525 మంది మాత్రమే నిర్మాణానికి ముగ్గు పోశారు. మిగిలిన వారు సందేహిస్తున్నారు. 133 ఇళ్లు బేస్మెట్ లేవల్కు చేరుకోగా, 98 మందికి మాత్రమే మొదటి విడతలో భాగంగా రూ.లక్ష చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు.
● కొత్తూరు మండలంలో 170 ఇళ్లు మంజూరు కాగా, 112 మంది మాత్రమే పనులు ప్రారంభించారు. మిగిలిన వారు ఏ నిర్ణయం తీసుకోలేదు.
● నందిగామ మండలంలో 402 ఇళ్లు మంజూరు కాగా, 270 మంది మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారు. మిగిలిన వారు ఎటూ తేల్చుకోలేపోతున్నారు.
మున్సిపాలిటీల్లో అలా..
● శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో 200 ఇళ్లు మంజూరు కాగా, 93 మంది మాత్రమే పనులు మొదలు పెట్టారు. 104 మంది తమకు ఇళ్లు వద్దని అధికారులకు స్పష్టం చేశారు. ముగ్గురు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
● ఆదిబట్ల మున్సిపల్ పరిధిలో 437 ఇళ్లు మంజూరు కాగా, 244 మంది మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారు. 140 మంది ఆసక్తి చూపడం లేదు.
● తుర్కయాంజాల్ మున్సిపల్ పరిధిలో 437 ఇళ్లు మంజూరు కాగా, 310 ఇళ్లకు మాత్రమేగ్రౌండింగ్ మొదలైంది. మరో 80 మంది నిర్మాణానికి నిరాకరించారు.
● మొయినాబాద్ మున్సిపాలిటీలో 200 ఇళ్లు మంజూరు కాగా, 101 మంది పనులు మొదలు పెట్టారు. 99 మంది నిర్మాణానికి నిరాకరించారు.
● తుక్కుగూడ పరిధిలో 275 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు కాగా, 194 ఇళ్లకు మాత్రమే గ్రౌండింగ్ అయింది.
● బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో 335 ఇళ్లు మంజూరు కాగా, 216 ఇళ్లుకు ముగ్గు పోశారు. 75 ఇళ్లు బేస్మెంట్ లెవల్కు చేరుకున్నాయి.
పెరిగిన సిమెంట్, స్టీలు ధరలు.. మేసీ్త్ర, ఇతర కూలీల చార్జీలు.. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఇళ్లు నిర్మించుకోవాలనే నిబంధనలు.. క్షేత్రస్థాయిలోని ఖర్చులు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి పొంతన లేకపోవడం.. ఖర్చుల కోసం చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం... వెరసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవరోధంగా మారాయి. మెజార్టీ లబ్ధిదారులు వెనుకాడుతున్నారు.
నిర్మాణానికి జంకుతున్న లబ్ధిదారులు
సామగ్రి ధరలతో బెంబేలు
అంచనాలకు మించి ఖర్చులు
ముగ్గు పోసేందుకు వెనుకడుగు
ప్రొసీడింగ్స్ రద్దు చేసుకుంటున్న వైనం
జిల్లాకు మంజూరైన ఇళ్లు: 2,800
నిర్మాణానికి నిరాకరిస్తున్నవారు: 1,304
ఎటూ తేల్చుకోలేనివారు: 403

ఇందిరమ్మ మాకొద్దు

ఇందిరమ్మ మాకొద్దు