హస్తం పార్టీలో పదవుల కుస్తీ | - | Sakshi
Sakshi News home page

పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్‌ పోస్టులపై సీనియర్ల కన్ను

May 2 2025 4:14 AM | Updated on May 2 2025 2:22 PM

పదవుల

పదవుల కుస్తీ

కాంగ్రెస్‌ పార్టీ డివిజన్‌, బ్లాక్‌, మండల, జిల్లా పదవులకు పోటాపోటీ

ఏళ్లుగా పార్టీనే నమ్ముకున్న వారికే సముచిత స్థానం కల్పించాలని డిమాండ్‌

పాత, కొత్త నేతల మధ్య కుదరని సయోధ్య
 

సాక్షి, రంగారెడ్డిజిల్లా: కాంగ్రెస్‌లో పదవుల పందే రం మొదలైంది. జిల్లా ఏళ్లుగా పార్టీ జెండాను నమ్ముకుని పని చేస్తున్న నాయకులు ప్రభుత్వ నామినేటెడ్‌ పోస్టులతో పాటు పార్టీ మండల, డివిజన్‌, మున్సిపాలిటీ, జిల్లా స్థాయి పదవులు ‘చే’జిక్కించుకునేందుకు ఎవరికి వారుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందుకోసం తమకు తెలిసిన ముఖ్య నేతలతో సిఫార్సులు చేయిస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ పీసీసీ, డీసీసీ కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. 

ఈ క్రమంలో నిరుత్సాహంలో ఉన్న కేడర్‌కు నామినేటెడ్‌ పదవులను కట్టబెట్టి కొంత బూస్టింగ్‌ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగా గురువారం రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని శంషాబాద్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. పార్టీ పరిశీలకులు సమావేశానికి హాజరై ముఖ్య నేతల అభిప్రాయాలు సేకరించారు. గ్రామ, మండల, మున్సిపాలిటీ, జిల్లా కమిటీ ఎంపికలో సామాజిక సమీకరణలు, సమర్థత గీటురాయిగా తీసుకోనున్నట్లు తెలిసింది. ఈనెల 20లోగా ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు సమాచారం.

డీసీసీ పీఠం కోసం పోటాపోటీ

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్థాగతంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, చేవెళ్ల ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలతో పాటు అనుచర వర్గం సైతం వచ్చి చేరింది. పదేళ్లుగా బీఆర్‌ఎస్‌లో పని చేసి, కాంగ్రెస్‌ కేడర్‌ను అనేక విధాలా ఇబ్బందులకు గురి చేసినవారు పార్టీలోకి వలసరావడాన్ని సగటు కార్యకర్త జీర్ణించుకోలేకపోతున్నాడు. క్షేత్రస్థాయిలో కలిసి పని చేయలేని పరిస్థితి నెలకొంది. మీనాక్షినటరాజన్‌ ఇటీవల గాంధీభవన్‌ వేదికగా చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. పాత, కొత్త నేతలను సమన్వయం చేయాల్సిన డీసీసీ ముఖ్యనేత ఈ విషయంలో చేతులెత్తేశారన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డీసీసీకి కొత్త బాస్‌ను నియమించనున్నారనే ప్రచారం కూడా ఉండటంతో ఈ పోస్టును దక్కించుకునేందుకు జిల్లాలోని పలువురు సీనియర్లు పోటీపడుతున్నారు. ఇప్పటికే తెలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ ముఖ్య నేతలతో పైరవీలు ప్రారంభించారు.

పదవుల కుస్తీ1
1/1

పదవుల కుస్తీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement