రెండు సబ్స్టేషన్ల మంజూరు
సిరిసిల్ల: జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ లోడ్ను దృష్టిలో ఉంచుకుని రెండు సబ్స్టేషన్లకు సాంకేతిక అనుమతులను ఎన్పీడీసీఎల్ జారీ చేసిందని కరీంనగర్ ఎస్ఈ ఆర్.రవీందర్ సోమవారం తెలిపారు. వీర్నపల్లి మండలం మద్దిమల్ల, తంగళ్లపల్లి మండలం రామన్నపల్లిలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లకు అనుమతులు మంజూరైనట్లు ప్రకటించారు. ఈ రెండు సబ్స్టేషన్ల నిర్మాణానికి సుమారు రూ.7.09 కోట్లు వ్యయమవుతుందని వివరించారు.
రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలు
వీర్నపల్లి: మండలంలో సోమవారం రెండు బైక్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని బంజేరుకు చెందిన బట్టు వెంకటేశ్ బైక్పై వీర్నపల్లికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఎదురుగా అదే గ్రామానికి చెందిన మాలోత్ హరిదాస్ వస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు బైక్లు ఢీకొట్టుకున్నాయి. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.


