‘మాజీలు’ మళ్లీ గెలిచారు
ప్రజాప్రతినిధులకు మరోసారి చాన్స్
ఐదు మండలాల్లో 17 మందికి అవకాశం
నాటి ప్రముఖులు.. నేటి పరాజితులు
సిరిసిల్ల: జిల్లాలో జరిగిన మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు మరోసారి విజయం సాధించారు. జిల్లాలో ని ఐదు మండలాల్లో గురువారం ఎన్నికలు జరగ్గా కొందరు మాజీ ప్రజాప్రతినిధులు మళ్లీ సర్పంచ్గా గెలుపొందారు. మరోవైపు జిల్లాలో పేరు గడించిన మాజీ ప్రజాప్రతినిధులు, రాజకీయాల్లో తలపండిన నేతలు సైతం పల్లెపోరులో బోల్తాపడ్డారు.
మరోసారి చాన్స్
గ్రామసర్పంచ్లుగా రెండోసారి చాన్స్ దక్కించుకున్న వారిలో కోనరావుపేట మండలం మామిడిపల్లి సర్పంచ్ పన్యాల లక్ష్మారెడ్డి ఉన్నారు. ఆయన భార్య విజయ 2013–2018 మధ్య సర్పంచ్గా పనిచేశారు. రాజన్నగొల్లపల్లె(కొలనూర్) సర్పంచ్గా బొజ్జం మల్లేశ్ విజయం సాధించగా.. ఆయన భార్య వసంత 2019–2024 వరకు సర్పంచ్గా పనిచేశారు. ఎగ్లాస్పూర్ సర్పంచ్గా పసుల పోచయ్య గెలువగా.. ఆయన భార్య విజయ 2003–2008 మధ్య కాలంలో సర్పంచ్గా ఉన్నారు. బావుసాయిపేట ఎంపీటీసీ సభ్యురాలిగా 2019–2024 వరకు పనిచేసిన షేక్ యాస్మిన్పాషా ఈసారి సర్పంచ్గా ఎన్నికయ్యారు. వెంకట్రావుపేట సర్పంచ్గా ఎన్నికై న మంతెన గీతాంజలి భర్త సంతోష్ 2019–2024 ఇటీవల సర్పంచ్గా పనిచేశారు.
పరాజితులైన ప్రముఖులు
రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం గల ప్రముఖులు సైతం ఈసారి పంచాయతీ పోరులో బోల్తాపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ వైస్చైర్మన్గా, ఇన్చార్జి చైర్మన్గా పనిచేసిన తీగల రవీందర్గౌడ్ వేములవాడ మండలం హన్మాజిపేట సర్పంచ్గా ఓటమిపాలయ్యారు. గతంలో రవీందర్గౌడ్ తండ్రి, తల్లి, భార్య సర్పంచ్లుగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో రవీందర్గౌడ్ ఓడిపోయారు. చందుర్తి మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య సర్పంచ్గా పరాజయం పాలయ్యారు. రుద్రంగి మాజీ ఎంపీపీ గంగం స్వరూపారాణి సర్పంచ్ ఎన్నికల బరిలో ఓడిపోయారు. వేములవాడ అర్బన్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మ్యాకల రవి భార్య అనుపురం సర్పంచ్ స్థానానికి పోటీ పడి ఓటమిపాలయ్యారు. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో ప్రముఖులు గ్రామపంచాయతీ ఎన్నికల్లో పరాజితులయ్యారు.


