పోలింగ్ నాడు సెలవు
● జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకోవాలి
సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే రోజు పబ్లిక్ హాలిడే(సెలవు దినం)గా ప్రకటించామని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం తెలిపారు. జిల్లాలో పంచాయితీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతున్నాయని, పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే ఆయా కేంద్రాల్లో ఎన్నికలకు ముందు రోజు, ఎన్నికల రోజున విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు స్థానిక సెలవులు ప్రకటించినట్లు వివరించారు. ఈనెల 11న మొదటి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ రోజున సెలవు ప్రకటించినట్లు తెలిపారు.
టీబీని ముందే గుర్తించాలి
టీబీ(క్షయ)ని ముందుగా గుర్తిస్తే చికిత్స అందించి, నయం చేయవచ్చని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. టీబీని విస్మరిస్తే మరొకరికి సోకే ప్రమాదం ఉందన్నారు. గర్భిణీలలో పోషక లోపాలను నివారించేందుకు ఐరన్ మందులు, పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యసిబ్బంది పనిచేయాలన్నారు. జిల్లా వైద్యాధికారి రజిత, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ ప్రవీణ్కుమార్, ఇన్చార్జి డీసీహెచ్ఎస్ రవీందర్ పాల్గొన్నారు.
వేములవాడఅర్బన్/వేములవాడరూరల్: వేములవాడఅర్బన్ మండల పరిషత్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ పరిశీలించారు. కేంద్రంలో సౌకర్యాలపై ఆరా తీశారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇన్చార్జి కలెక్టర్ పరిశీలించారు. ధాన్యం నిలువలు పరిశీలించి, సేకరణ, తరలింపు గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ విజయప్రకాశ్రావు, ఎంపీడీవోలు శ్రీనివాస్, కీర్తన తదితరులు ఉన్నారు.


